
ఏపీలో అక్టోబర్ 16న మోడీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 16న ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన ఖరారైంది. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న ప్రధాని అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఐదుసార్లు పర్యటించారు. ప్రతి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులతో వరాలు కురిపించారు.
ఉమ్మడి కర్నూలులో పర్యటన
అక్టోబర్ 16న కర్నూల్లో జరిగే జీఎస్టీ సంస్కరణల ర్యాలీ, రోడ్ షో, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలతో మోడీ మరోసారి రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం నింపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఈ పర్యటనలో శ్రీశైలం మల్లికార్జున దర్శనం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలు డబుల్ ఇంజిన్ సర్కార్ శక్తిని చాటడమే కాక, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు కేంద్ర మద్దతును హైలైట్ చేస్తాయి. జనవరి 2025లో విశాఖపట్నంలో జరిగిన రోడ్ షో తర్వాత మోడీ "డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి రెక్కలు విప్పింది. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు పేదలకు, యువతకు ఉపాధి అవకాశాలను తీసుకొస్తాయి" అని ప్రకటించారు.
రాయలసీమ అభివృద్ధిపై ఫోకస్
గత పర్యటనల్లో మోడీ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను, అమరావతిలో రాజధాని నిర్మాణ పునఃప్రారంభాన్ని, విజయనగరం పోర్టు ప్రాజెక్టును ప్రారంభించారు. ఇవి మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొస్తున్నాయి. అక్టోబర్ 16న కర్నూల్, నంద్యాల జిల్లాల్లో రోడ్లు, ఇరిగేషన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,000 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రాజెక్టులు ప్రకటించనున్నారు. దీంతో గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలపై వరాలు కురిపించిన ప్రధాని మోడీ ఈ పర్యటనతో రాయలసీమ అభివృద్ధికి ఊతం అందిస్తారని చెబుతున్నారు. మోడీ పర్యటనలో ప్రకటించే ప్రాజెక్టులు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి.
