
ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత కోచింగ్
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్ ఆదివారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 340 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత కోచింగ్ అందించబడుతుంది. విజయవాడ, విశాఖపట్నం అలాగే తిరుపతి కేంద్రాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిక్షణా కార్యక్రమం డిసెంబర్ 10, 2025 నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. ఈ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు పూర్తిగా ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించబడతాయని ఆయన పేర్కొన్నారు.
అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ నెల 26.11.2025తో ముగుస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఆసక్తి గల యువత తక్షణం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు నవంబర్ 30, 2025న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు.
యూపీఎస్సీ సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ యువతకు ఇది విశేష అవకాశం అని ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. తమ భవిష్యత్తును మార్చుకునే ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదని ఆయన సూచిస్తూ, మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ https://apstudycircle.apcfss.inను సందర్శించాలని సూచించారు.
