Let's talk: editor@tmv.in
ఎస్‌ఐఆర్‌లో భారీ కుట్ర జరుగుతోంది: అఖిలేష్ యాదవ్

ఎస్‌ఐఆర్‌లో భారీ కుట్ర జరుగుతోంది: అఖిలేష్ యాదవ్

Pinjari Chand
2 ఫిబ్రవరి, 2026

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లో ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రతిపక్ష ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల జాబితా నుంచి ఎంపిక చేసుకుని మరీ పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇదో భారీ కుట్ర అని ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసి ఈ మెగా స్కామ్ పై కోర్టులు, ఎన్నికల సంఘం, జర్నలిస్టులు దృష్టి పెట్టాలని కోరారు.

ఎవరు ఫారం–7 పంచుతున్నారు?

ఎస్ఐఆర్ కింద గ్రామాల్లో ఎవరు ప్రీ-ప్రింటెడ్ ఫారం–7 (వేరొకరి పేరు తొలగించేలా చేసే ఫారం) పంచుతున్నారు? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫారమ్‌లలోని ఫిర్యాదుదారులు గుర్తు తెలియని వ్యక్తులు, నకిలీ సంతకాలతో చాలా మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. ఆయన అభిప్రాయం ప్రకారం పీడీఏ (వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక) సమూహాల వారికే తొలగిస్తున్నట్లు, ముఖ్యంగా మైనారిటీ ఓటర్లను భారీగా తొలగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వీరిపై ఎక్కువ ప్రభావం పడబోతుందని హెచ్చరించారు. డాక్యుమెంట్లు పూర్తిగా ఉన్నా బాధితులకు తెలియకుండానే వారి పేర్లు భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియా, లోకల్ యూట్యూబర్లు, జర్నలిస్టులకూ ఈ మెగా కుట్రను బయటపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం అని చెప్పారు.

జనవరి 23న, యుపి సిఇఒ నవదీప్ రిన్వా, 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలలోని వివరాలు 2003 రికార్డులలో ఉన్న వివరాలతో సరిపోలని ఓటర్లకు నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. 'నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్' లక్ష్యాన్ని సాధించడానికి, ధృవీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. రిజిస్ట్రేషన్ అధికారుల ముందు విచారణలకు హాజరు కాలేని ఓటర్లకు తప్పనిసరి భౌతికంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఓటరు సంతకం చేసిన లేదా వేలిముద్ర వేసిన రాతపూర్వక అధికారాన్ని అందించడం ద్వారా వారి తరపున విచారణకు హాజరు కావడానికి ప్రతినిధికి అధికారం ఇవ్వవచ్చని సీఈవో చెప్పారు.