
ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం
శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)ని మళ్లీ స్థాపించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు భారత ఈడీ అధికారులు గుర్తించారు. ఆ దేశానికి చెందిన పౌరురాలు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండడం, నాడు తమిళ్ ఈలంలో యాక్టివ్ గా ఉన్న వారికి ఇక్కడి నుంచి చెల్లింపులు చేయడానికి ప్రయత్నించడంతో మళ్లీ తమిళ్ ఈలం పురుడు పోయడానికి వనరులను కూడగడుతున్నట్లు అధికారులు విచారణలో తేల్చారు.
2019లో టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చిన శ్రీలంక పౌరురాలైన లెచ్చుమనన్ మేరీ ఫ్రాన్సిస్కా గడువు ముగిసినా నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ తీసుకుని ఇక్కడే గడిపింది. 2021 అక్టోబర్ లో పాస్ పోర్టుతో చెన్నై నుంచి శ్రీలంకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఆమెపై నకిలీ పాస్పోర్ట్ కేసును ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో కీలక విషయాలు ఆమె నుంచి రాబట్టారు. ఎల్టీటీటీఈ పునరుద్ధరణకు తాను ఇక్కడ ప్రయత్నాలు చేసినట్లు, అందుకు ఆమె యాక్టివ్గా లేని బ్యాంక్ ఖాతాల యాక్సెస్ కోసం ప్రయత్నించినట్లు, క్యాడర్ నియామకానికి కుట్రలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా టీ కెన్నిస్టన్ ఫెర్నాండోతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు.
రూ.42 కోట్లు మళ్లించేందుకు యత్నం
డెన్మార్క్లో స్థిరపడిన శ్రీలంక తమిళుడు, ఎల్టీటీఈ మాజీ కార్యకర్త ఉమాకాంతన్తో నిరంతరం ఈ యువతి సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉమాకాంతన్ సూచనలతో మేరీ ఫ్రాన్సిస్కా ఇక్కడి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.42 కోట్లను మళ్లించేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ తేల్చింది. పునరుద్ధరణలో భాగంగా క్యాడర్ కు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. అయితే తాజాగా ఆమెను మళ్లీ విచారించడానికి ఎన్ఐఏ కోర్టును అనుమతి కోరింది. ఇదో విచిత్రమైన కేసుగా పరిగణిస్తూ విచారణకు పోలీసులకు అనుమతినిచ్చింది. దీంతో ఆమెను రెండు రోజుల పాటు ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు.
