
ఎలక్ట్రానిక్స్ రంగంలో మహిళలకు భారీగా ఉద్యోగావకాశాలు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగం ద్వారా ముఖ్యంగా మహిళలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సాధారణ కార్మిక ఉద్యోగాలకే పరిమితమైన ఈ రంగం, ఇప్పుడు నైపుణ్యంతో కూడిన మంచి ఉపాధిని కూడా కల్పిస్తోందని మంత్రి వివరించారు.
ఒక్క ఫ్యాక్టరీ.. 30 వేల ఉద్యోగాలు
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన కొత్త ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ దీనికి మంచి ఉదాహరణ అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. కేవలం 8 నుంచి 9 నెలల వ్యవధిలోనే ఈ ప్లాంట్లో దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు కల్పించగా, అందులో సుమారు 80 శాతం మంది మహిళలే కావడం విశేషం.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందిస్తూ, "పదేళ్ల క్రితం ఒక భారీ ఫ్యాక్టరీని మహిళలే నడిపించడం అనేది ఊహకు కూడా అందని విషయం. కానీ నేడు ఎలక్ట్రానిక్స్ రంగం మహిళలకు భారీ స్థాయిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను ఇస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మహిళా సాధికారతకు, జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి నిదర్శనం” అని అన్నారు.
దేవనహళ్లి ప్లాంట్లో ఉద్యోగాలు పొందిన మహిళల్లో చాలా మంది తొలిసారి అధికారిక రంగంలోకి అడుగుపెడుతున్నవారే. వీరిలో ఎక్కువ మంది 19 నుంచి 24 ఏళ్ల వయస్సు గల యువతులు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు 50,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్లాంట్లో ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16తో ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లను అసెంబుల్ చేస్తున్నారు. తయారయ్యే ఫోన్లలో 80 శాతం కంటే ఎక్కువ భాగం విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.
ఫాక్స్కాన్ ఈ దేవనహళ్లి ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్, భారత్లో ఫాక్స్కాన్కు చెందిన అతిపెద్ద తయారీ కేంద్రంగా మారనుంది. ఉత్పత్తి సామర్థ్యం, ఉద్యోగాల పరంగా ఇది చాలా కీలకంగా భావిస్తున్నారు.
ఈ కొత్త ప్లాంట్, ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఫాక్స్కాన్ తొలి ఐఫోన్ తయారీ యూనిట్ను కూడా మించనుంది. ఆ యూనిట్లో ప్రస్తుతం సుమారు 41,000 మంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా, అక్టోబర్లో ఫాక్స్కాన్ తమిళనాడులో మరో రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ మరో 14,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ప్రస్తుతం ఫాక్స్కాన్ తమిళనాడు (శ్రీపెరుంబుదూర్, కర్ణాటక, తెలంగాణ (కొంగరకలాన్) రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా పెట్టుబడులతో భారత్లో తన తయారీ విస్తరణను మరింత బలోపేతం చేస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మహిళల ఉపాధికి మంచి భవిష్యత్తును అందిస్తుందని నిపుణులు అంటున్నారు.
