
ఎరువుల సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జైపూర్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్లో రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఖరీఫ్ సీజన్కు ఫాస్ఫేట్–పోటాష్ ఎరువుల సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలను ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయాలు పట్టణ అభివృద్ధి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, రైతుల సంక్షేమానికి దోహదపడతాయని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పేర్కొన్నారు.
ఖరీఫ్ 2026కు ఎరువుల సబ్సిడీ పెంపు
ఖరీఫ్ 2026 సీజన్కు ఫాస్ఫేటిక్, పోటాషిక్ (పీఅండ్కే) ఎరువులపై సబ్సిడీని 12 శాతం పెంచి రూ.41,534 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఇదే సీజన్లో ఈ సబ్సిడీ రూ.37,216 కోట్లు ఉండేది. నైట్రోజన్కు కిలోకు రూ.47.32, ఫాస్ఫేట్కు రూ.52.76, సల్ఫర్కు రూ.3.16 సబ్సిడీ నిర్ణయించారు. పొటాష్పై సబ్సిడీ కిలోకు రూ.2.38గా యథాతథంగా కొనసాగుతుంది. ఈ సబ్సిడీ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎరువుల ధరలు పెరిగినా రైతులకు సరసమైన ధరలకే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
జైపూర్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం
కేంద్ర కేబినెట్ జైపూర్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.13,037.66 కోట్ల వ్యయంతో 41 కిలోమీటర్ల పొడవైన కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో 36 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును రాజస్థాన్ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ అమలు చేయనుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వాల మధ్య 50:50 భాగస్వామ్యంతో పనిచేసే సంస్థ. ప్రహ్లాద్పురా నుంచి టోడి మోడ్ వరకు ఉత్తర–దక్షిణ కారిడార్గా ఈ మెట్రో మార్గం నిర్మించనున్నారు. సీతాపురా ఇండస్ట్రియల్ ఏరియా, జైపూర్ విమానాశ్రయం, టోంక్ రోడ్, ఎస్ఎంఎస్ ఆసుపత్రి, అంబాబారి, విద్యాధర్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాలకు ఇది అనుసంధానం కల్పిస్తుంది. ప్రస్తుతం ఫేజ్–1లో 11.64 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్–వెస్ట్ కారిడార్ (మాన్సరోవర్ నుంచి బాడి చౌపర్ వరకు) పనిచేస్తోంది. ఫేజ్–2 పూర్తి అయితే నగరంలో ప్రజా రవాణా వినియోగం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు 2031 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అరుణాచల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు
కేంద్ర కేబినెట్ అరుణాచల్ ప్రదేశ్లో రెండు పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.40,150 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
కమల జలవిద్యుత్ ప్రాజెక్టు
1,720 మెగావాట్ల సామర్థ్యంతో కమల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును కమ్లే, క్రా దాడీ, కురుంగ్ కుమే జిల్లాల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.26,069.50 కోట్ల వ్యయం అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సుమారు 6,870 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
కలై–II జలవిద్యుత్ ప్రాజెక్టు
లోహిత్ నదిపై అంజావ్ జిల్లాలో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో కలై–II ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీనికి రూ.14,105.83 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సుమారు 4,853 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రసరణ వ్యవస్థలు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం తెలిపింది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.
రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ వ్యయం పెంపు
అదే సమయంలో రాజస్థాన్లో నిర్మిస్తున్న ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు వ్యయాన్ని కూడా కేంద్ర కేబినెట్ పెంచింది. ముందుగా రూ.43,129 కోట్లుగా ఉన్న అంచనాను రూ.79,459 కోట్లకు పెంచింది. ఈ రిఫైనరీ ప్రాజెక్టును హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం కలిసి అమలు చేస్తున్నాయి. బాలొత్రా జిల్లాలో నిర్మిస్తున్న ఈ రిఫైనరీ సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ టన్నులు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఏప్రిల్ 21న ప్రారంభించనున్నారు. వాణిజ్య కార్యకలాపాలు 2026 జూలై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్తో పాటు పాలీప్రొపిలీన్, పాలీథిలీన్, బెంజీన్, బ్యూటాడైన్ వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారవుతాయి. ఈ ప్రాజెక్టుతో దేశీయ ఇంధన భద్రత పెరగడంతో పాటు పెట్రోకెమికల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
