Let's talk: editor@tmv.in
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, పొన్నం
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, పొన్నం

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, పొన్నం

Dantu Vijaya Lakshmi Prasanna
3 ఏప్రిల్, 2026

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూడీఎఫ్ అభ్యర్థుల తరపున విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌కు ఓటు వేయడం అంటే పరోక్షంగా బీజేపీకి ఓటు వేయడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, వీరిద్దరినీ ఓడిస్తేనే కేరళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. పినరయి విజయన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని విమర్శిస్తూ.. "నీ పో మోనే విజయా.. నీ టైమ్ అయిపోయింది" అంటూ సినిమా డైలాగ్‌తో కేరళ ప్రజలను ఉత్తేజపరిచారు.

గాంధీ కుటుంబంపై కేరళ ప్రజల మమకారం

కేరళ ప్రజలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేస్తూ, గాంధీ కుటుంబంపై ప్రేమ చూపిస్తున్న కేరళ ప్రజలకు తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. గత పదేళ్లుగా కేరళలో విజయన్, కేంద్రంలో మోదీ పాలన వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, కేవలం కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కరుణాకరన్, ఊమెన్ చాందీ వంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే కేరళ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని గుర్తు చేశారు.

తెలంగాణ 'ప్రజా పాలన' మోడల్

తెలంగాణలో 2023లో జరిగిన రాజకీయ మార్పును రేవంత్ రెడ్డి ఉదహరించారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజలు ఏ విధంగా మార్పు తెచ్చారో, కేరళలో కూడా అదే పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను చూడాలని పినరయి విజయన్‌కు సవాల్ విసిరారు. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే ఇలాంటి అద్భుతమైన ప్రజా రంజక పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పుదుచ్చేరిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం

మరోవైపు పుదుచ్చేరిలోని లాస్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వైద్యనాథన్‌కు మద్దతుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడే వైద్యనాథన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో ఏఐసీసీ ముఖ్య నేతలు ముకుల్, నిజాముద్దీన్, అంజలి తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని తెలంగాణ నాయకత్వం ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేసింది.