Let's talk: editor@tmv.in
ఎంసీసీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ఈసీఐ

ఎంసీసీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ఈసీఐ

Pinjari Chand
17 మార్చి, 2026

అస్సాం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా(ఈసీఐ) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంసీసీ అమల్లోకి వచ్చినట్లు ఈసీఐ తెలిపింది. ఈ నియమాలు సంబంధిత రాష్ట్రాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు, ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

వ్యక్తిగత గోప్యతకు గౌరవం

ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడి గోప్యతను గౌరవించాలని ఈసీఐ సూచించింది. వ్యక్తిగత నివాసాల ముందు ప్రదర్శనలు, ధర్నాలు, పికెటింగ్ నిర్వహించకూడదని పేర్కొంది. అలాగే యజమాని అనుమతి లేకుండా భూమి, భవనాలు, గోడలపై జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు పెట్టరాదని స్పష్టం చేసింది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ

ఎంసీసీ ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఈసీఐ తెలిపింది. ఓటర్లు, రాజకీయ పార్టీలు 1950 కాల్ సెంటర్ నంబర్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చు. అలాగే సీ–విజిల్‌ యాప్ ద్వారా కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను నివేదించవచ్చు.

5,000కు పైగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు

ఎంసీసీ అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,173 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించినట్లు ఈసీఐ తెలిపింది. ఫిర్యాదులు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకునేలా ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా 5,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు కూడా నియమించారు. రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈసీఐ సూచించింది. ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల కోసం ఇది అవసరమని తెలిపింది. అలాగే లౌడ్ స్పీకర్లు వాడటం వంటి విషయాలకు అవసరమైన అనుమతులు తీసుకోవాలని పేర్కొంది.

ప్రభుత్వ యంత్రాంగం వినియోగం నిషేధం

మంత్రులు అధికారిక కార్యక్రమాలను ఎన్నికల ప్రచారంతో కలపరాదని ఈసీఐ స్పష్టం చేసింది. ప్రభుత్వ వాహనాలు, సిబ్బంది లేదా ఇతర వనరులను ప్రచారం కోసం ఉపయోగించరాదని పేర్కొంది. అన్ని అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశించింది.

సువిధా మాడ్యూల్ ప్రారంభం

రాజకీయ పార్టీలు ప్రజా ప్రదేశాలు, మైదానాలు, హెలిప్యాడ్ల వినియోగానికి అనుమతులు పొందేందుకు సువిధ మాడ్యూల్‌ను ఈసీఐ ప్రారంభించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఆధారంగా ఈ సదుపాయాలు కేటాయిస్తారు.

ఎంసీసీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ఈసీఐ - Tholi Paluku