
‘ఉనా’ బాధితులకు మద్దతుగా ఉంటాం: రాహుల్గాంధీ
గుజరాత్లో బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలపై వివక్ష, హింస, విద్వేష వాతావరణం క్రమంగా పెరుగుతోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఆరోపించారు. 2016లో జరిగిన ఉనా దళితులపై దాడి ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోవడం బాధాకరమని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఇటీవల గుజరాత్కు చెందిన దళిత, ఆదివాసీ ప్రతినిధులతో జరిగిన భేటీ వీడియోను పంచుకున్నారు. ఈ సమావేశం తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితుల పరిస్థితి తనను ఆలోచనలో ముంచేసిందని తెలిపారు.
2016 జూలై 11న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా సమీపంలోని మోటా సమధియాలా గ్రామంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. చనిపోయిన ఆవు మృతదేహాన్ని తొలగిస్తున్న నలుగురు దళిత యువకులను గోరక్షకులమని చెప్పుకున్న వ్యక్తులు బహిరంగంగా కొట్టిన ఘటన అందరినీ కుదిపేసింది. అనంతరం వారిని అక్రమంగా పోలీస్ కస్టడీలో పెట్టి కూడా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన జరిగిన దశాబ్దం గడిచినా బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల గాయాలు ఇంకా మానలేదని, పరిస్థితి మెరుగుపడాల్సింది పోయి మరింత దిగజారిందని అన్నారు. తాజాగా బాధితుల ప్రతినిధులతో మాట్లాడినప్పుడు బయటపడిన వివరాలు మరింత ఆందోళన కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అంతగా కొట్టడంతో అతనికి 19 ఎముకలు విరిగిపోయాయని, మరొకరి సోదరుడిని సజీవదహనం చేసిన ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
ఇంకా న్యాయం కోసం ఎదురుచూడటం వ్యవస్థ వైఫల్యమే
ఇవి ఒంటరి సంఘటనలు కావని, భయం, అన్యాయం పెరిగిన వాతావరణానికి ఇవి నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యంగా తమ హక్కుల కోసం గొంతెత్తే వారిని బెదిరింపులు, హింస, హత్యల ద్వారా అణచివేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలపై ద్వేషం, వివక్ష, దాడులు క్రమంగా పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉనా ఘటన బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తుండటం కూడా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. దశాబ్ద కాలంగా న్యాయం కోసం ఎదురుచూడాల్సి రావడం కూడా ఒక పెద్ద అన్యాయమేనని ఆయన వ్యాఖ్యానించారు. బలహీన వర్గాల గొంతును అణచివేస్తూ, నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గతంలో కూడా ఈ కుటుంబాల పక్కన నిలిచానని, ఇప్పటికీ వారితోనే ఉన్నానని, భవిష్యత్తులో కూడా వారి స్వరాన్ని బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ఉనా బాధితుల ఆర్తనాదం ఇంకా న్యాయ ద్వారాలను తడుతోంది. గత 10 ఏళ్లుగా వారు న్యాయం కోసం తలుపులు తడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దళితులు, ఆదివాసీలపై అవమానం, హింస, హత్యలు సాధారణమవుతున్నాయని విమర్శించిన ఆయన, ఇదే మోడల్ను దేశమంతటా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు.
