Let's talk: editor@tmv.in
ఉత్తరాఖండ్ రిషికేష్‌లో బంజీ జంపింగ్ ప్రమాదం

ఉత్తరాఖండ్ రిషికేష్‌లో బంజీ జంపింగ్ ప్రమాదం

Gaddamidi Naveen
16 నవంబర్, 2025

ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ సమీపంలోని శివపురిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న బంజీ జంపింగ్ ప్రమాదంలో ఒక పర్యాటకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపారమైన ఎత్తు నుంచి కిందపడి ఒక పర్యాటకుడు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.అపరా అమ్యూజ్‌మెంట్ థ్రిల్ ఫ్యాక్టరీ పేరుతో నడుస్తున్న అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో హర్యానా గురుగ్రామ్‌కు చెందిన సోను కుమార్ జంప్ చేస్తుండగా మధ్యలో తాడు (కార్డ్) తెగిపోవడం వల్ల కిందపడ్డాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, భారీ ఎత్తు నుంచి పడిపోయిన సోను కుమార్‌ను వెంటనే రిషీకేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు, ముఖ్యంగా పక్కటెముకలు అలాగే ఎడమ చేయి విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని మునికి రెతి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ప్రభుదీప్ చౌహాన్ తెలిపారు.

సోను కుమార్ నాలుగు మంది స్నేహితులు విక్రమ్, రాజేశ్, అక్షయ్, రాజ్‌కుమార్‌లతో కలిసి రిషీకేశ్‌కు వచ్చారు. ఈ సంఘటనపై బాధితుడు ఈ ఘ‌ట‌న పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించినట్లు టెహ్రీ జిల్లా కలెక్టర్ నితికా ఖండేల్వాల్ వెల్లడించారు. నరేంద్రనగర్ సబ్-డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ను విచారణ చేపట్టి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అపరా అమ్యూజ్‌మెంట్ థ్రిల్ ఫ్యాక్టరీలో బంజీ జంపింగ్‌ను తక్షణమే నిలిపివేశామని టెహ్రీ జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి ఎస్.ఎస్. రాణా తెలిపారు. జిల్లాలోని అన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై సవ్యమైన పరిశీలన నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు భద్రతా ఆడిట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

అడ్వెంచర్ టూరిజంలో భద్రతా ప్రమాణాలు అవసరం

పర్యాటకులు అధికంగా అడ్వెంచర్ కార్యక్రమాలకు ఆకర్షితులు అవుతున్న ఈ సమయంలో భద్రతే ప్రధాన సవాల్‌గా మారింది. రోప్ తెగిపోవడంతో పర్యాటకుడు తీవ్రంగా గాయపడ్డ ఈ ఘటన, నిర్వహణ లోపాలు నియంత్రణల కఠినతరం అవసరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.మొదటగా, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఉపయోగించే పరికరాల నాణ్యత అత్యంత కీలకమైనది.ప్రతి వినియోగానికి ముందు పరికరాలను సమగ్రంగా తనిఖీ చేసే ప్రక్రియ తప్పనిసరి. ఇన్స్ట్రక్టర్లు సర్టిఫైడ్, అనుభవజ్ఞులు కావడం మరో ముఖ్య అంశం. తగిన శిక్షణ లేకుండా సిబ్బందిని నియమించడం ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది.

అధికారులు కూడా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు సేఫ్టీ ఆడిట్లు చేయడం, తక్కువ రేటింగ్ వచ్చిన సంస్థలను నిలిపివేయడం అవసరం. బంజీ టవర్ నిర్మాణం, ప్లాట్‌ఫార్మ్ యాంకరింగ్ నిర్మాణ భద్రతకు ప్రత్యేక ధ్రువపత్రాలు ఉండాలి. ప్రమాదాలు తక్షణమే స్పందించేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కూడా కీలకం.మొత్తం మీద, భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే అడ్వెంచర్ టూరిజం నమ్మకంగా కొనసాగుతుంది. కఠిన నియంత్రణలు, బాధ్యతాయుత నిర్వహణ, ప్రజల్లో అవగాహన ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.

ఉత్తరాఖండ్ రిషికేష్‌లో బంజీ జంపింగ్ ప్రమాదం - Tholi Paluku