Let's talk: editor@tmv.in
ఉగ్ర ముప్పు.. పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

ఉగ్ర ముప్పు.. పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

Shaik Mohammad Shaffee
11 నవంబర్, 2025

పాకిస్తాన్‌లో ఉగ్రవాద బెదిరింపులు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశీయ రైలు సర్వీసుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా సమస్యలను, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ రైల్వేస్ క్వెట్టా‍- పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నాలుగు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

రైల్వే అధికారుల ప్రకారం, ఈ ఎక్స్‌ప్రెస్ రైలును నవంబర్ 9 నుండి నవంబర్ 12 వరకు నిలిపివేశారు. భద్రతా సంస్థలు, నిఘా సంస్థల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, రైల్వే ఆస్తులను దృష్టిలో ఉంచుకొని ఈ రైలును నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్ రైల్వేస్‌కు చెందిన ముఖ్యమైన ప్యాసింజర్ రైళ్లలో ఒకటి. ఇది బలూచిస్తాన్ రాష్ట్రాన్ని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాతో కలుపుతుంది. రవాణాకు అత్యంత చౌకైన మార్గంగా దీనిపై వేలాది మంది ప్రజలు ఆధారపడుతున్నారు. తాత్కాలిక సస్పెన్షన్ కారణంగా ఈ రెండు ప్రావిన్సుల ప్రజలు ప్రయాణానికి ప్రత్యామ్నాయాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది.

దాడుల లక్ష్యంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ నివేదిక ప్రకారం, జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ గత కొన్నేళ్లుగా ఉగ్రదాడులకు తరచుగా గురవుతోంది. ఈ ఏడాదిలోనే జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఏడు సార్లు దాడులు జరిగాయి. కనీసం 30 మంది పౌరులు మృతి చెందగా, 35 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఈ మార్గం అత్యంత సున్నితంగా మారింది.

ఈ ఏడాది మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. ఈ హైజాక్ ఘటనలో 31 మంది పౌరులు, 33 మంది మిలిటెంట్లు మరణించారు. భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించి 300 మందికి పైగా ప్రయాణికులను రక్షించాయి. సెప్టెంబర్‌లో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ ప్రాంతంలో జరిగిన పేలుడులో ఆరు బోగీలు పట్టాలు తప్పి 12 మంది గాయపడ్డారు. అక్టోబర్‌లో సింధ్‌లోని షికార్‌పూర్ జిల్లాలో రైలు పట్టాలపై జరిగిన పేలుడు కారణంగా ఐదు బోగీలు పట్టాలు తప్పి ఏడుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ దాడికి బలోచ్ రిపబ్లిక్ గార్డ్స్ బాధ్యత వహించింది.

ఉగ్ర ముప్పు.. పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత - Tholi Paluku