
ఈ-గవర్నెన్స్ డేటా భద్రతకు తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్
ఆంధ్రప్రదేశ్లో ఈ-గవర్నెన్స్ వ్యవస్థల భద్రతను మరింత పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు అందిస్తున్న డిజిటల్ సేవలకు రక్షణ కవచంగా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్కు మద్దతుగా పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్, రాష్ట్రస్థాయి డేటాకు కేంద్రకృత నిల్వగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రభుత్వ వెబ్ పోర్టల్స్, పౌర సేవల డెలివరీ ప్లాట్ఫార్ములు, అంతర్గత పాలన వ్యవస్థలు వంటి అనేక కీలక అప్లికేషన్లు హోస్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా సాంకేతిక లోపం లేదా ప్రకృతి విపత్తు సంభవించినా సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు డిజాస్టర్ రికవరీ సెంటర్ అవసరం ఏర్పడింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్ ప్రధాన కార్యకలాపాలు గ్రీన్ఫీల్డ్ రాజధాని అయిన అమరావతిలో కొనసాగుతున్నాయి. మంగళగిరిలోని ప్రైవేట్ డేటా సెంటర్లో లీజు ప్రాతిపదికన ఇది పనిచేస్తోంది. అయితే భౌగోళికంగా దూరంగా ఉన్న ‘ఫార్-సైట్’ డీఆర్ సదుపాయం లేకపోవడం వల్ల పలు శాఖలు ఆందోళన వ్యక్తం చేశాయి.
స్టేట్ డేటా లేక్ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ హోస్టింగ్ వాతావరణాల నుంచి ప్రభుత్వ అప్లికేషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్కు మైగ్రేట్ చేయాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, అప్లికేషన్ల భద్రతకు డీఆర్ మద్దతు తప్పనిసరి కావడంతో కొత్త సెంటర్ అవసరం మరింత స్పష్టమైంది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్(అమరావతి)కి ప్రత్యామ్నాయ భద్రతా కేంద్రంగా ఇది పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దీనికి అనుగుణంగా, ఏపి ప్రభుత్వం మొత్తం రూ.195 కోట్లతో సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఇందులో పౌర నిర్మాణ పనులు, ఐటీ, నాన్-ఐటీ మౌలిక వసతుల ఏర్పాటు, ఐదేళ్ల నిర్వహణ వ్యయం తదితర అంశాలు ఉన్నాయి. ఈ డీఆర్ సెంటర్ను బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బూట్) మోడల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన మూలధన వ్యయంను స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. తిరుపతిలోని ఐఐడిటి క్యాంపస్లో ఈ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు కానుంది.
డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు ద్వారా ప్రకృతి విపత్తులు, సాంకేతిక లోపాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ డిజిటల్ సేవలు నిరంతరంగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో ఈ-గవర్నెన్స్పై ప్రజల నమ్మకం మరింత బలపడడమే కాకుండా, రాష్ట్ర డిజిటల్ మౌలిక వసతులకు దీర్ఘకాలిక భద్రత లభించనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
