Let's talk: editor@tmv.in
ఇరాన్ రాయబారిపై లెబనాన్ బహిష్కరణ వేటు

ఇరాన్ రాయబారిపై లెబనాన్ బహిష్కరణ వేటు

Shaik Mohammad Shaffee
26 మార్చి, 2026

పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రభావానికి అడ్డుకట్ట వేసే క్రమంలో లెబనాన్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బెరూట్‌లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ రెజా షిబానీని 'పర్సన నాన్ గ్రాటా' (ఆతిథ్య దేశంలో ప్రవేశించడానికి, ఉండడానికి అనర్హుడైన వ్యక్తి)గా ప్రకటిస్తూ ఈ వారాంతంలోగా దేశం విడిచి వెళ్లాలని లెబనాన్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో ఇరాన్ జోక్యాన్ని నిరసిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

హెజ్బొల్లా వెనుక ఇరాన్ హస్తం!

లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ గత వారాంతంలో ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. లెబనాన్ భూభాగంలో హెజ్బొల్లా సాగిస్తున్న దాడుల వెనుక ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (ఐఆర్ జీసీ) హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోందని, ఆ ప్రతీకార చర్యలతో లెబనాన్ ప్రజలకు సంబంధం లేదని ప్రధాని స్పష్టం చేశారు. మార్చి 2న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లెబనాన్‌లో 1,072 మంది మరణించగా, 3,000 మంది గాయపడ్డారు. ఈ వినాశనానికి కారణమవుతున్న హెజ్బొల్లా సాయుధ కార్యకలాపాలను ప్రభుత్వం ఇప్పటికే చట్టవిరుద్ధంగా ప్రకటించింది.

ఇరాన్‌పై లెబనాన్ కఠిన చర్యలు

లెబనాన్ దేశంలో ఇరాన్ జోక్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం వరుసగా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇరాన్ ప్రజలు తమ దేశంలోకి వీసా లేకుండా నేరుగా వచ్చే వెసులుబాటును లెబనాన్ రద్దు చేసింది. అంతేకాకుండా ఇరాన్ నుంచి వచ్చే వ్యాపార విమానాలు తమ దేశ రాజధాని బెరూట్ విమానాశ్రయంలో దిగకుండా గత ఏడాది కాలంగా నిషేధం కొనసాగిస్తోంది. ఈ విమానాల ద్వారానే హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపులకు డబ్బులు, ఆయుధాలు అందుతున్నాయని లెబనాన్ ప్రభుత్వం బలంగా అనుమానిస్తోంది. తాజా పరిణామాల్లో భాగంగా ఇరాన్ రాయబారిని కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే, ఇవన్నీ కేవలం ఆంక్షలు మాత్రమేనని, ఇరాన్‌తో పూర్తిస్థాయిలో సంబంధాలు తెంచుకోవడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతర్గత విభేదాలు.. హెజ్బొల్లా నిరసన

ప్రభుత్వ నిర్ణయంపై లెబనాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఇది దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టు అని, ఒక వర్గం ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించింది. దేశంలోని షియా మత పెద్దలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని 'తొందరపాటు చర్య'గా అభివర్ణించారు. మరోవైపు పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న వర్గాలు మాత్రం ఇరాన్ పెత్తనాన్ని అడ్డుకోవడానికి ఇది సరైన నిర్ణయమని స్వాగతిస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అధికారుల మృతి

మరోవైపు లెబనాన్‌లో ఉన్న ఇరాన్ అనుబంధ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మార్చి 8న బెరూట్‌లోని ఒక హోటల్‌పై జరిగిన దాడిలో నలుగురు ఇరాన్ పౌరులు మరణించగా, తాజాగా సోమవారం జరిగిన దాడిలో ఐఆర్‌జీ కుదుస్ ఫోర్స్ అధికారి మొహమ్మద్ అలీ కౌరానీ హతమయ్యారు. 1980ల నుంచి ఇరాన్ మద్దతుతో బలపడిన హెజ్బొల్లా, ప్రస్తుతం లెబనాన్‌లో అత్యంత శక్తివంతమైన సాయుధ సంస్థగా ఎదిగింది. గత ఏడాది పేజర్ దాడులు, నస్రల్లా మృతితో బలహీనపడిన ఈ సంస్థను నియంత్రించేందుకు లెబనాన్ ప్రభుత్వం ఇప్పుడు దౌత్యపరమైన అస్త్రాన్ని ప్రయోగించింది.

ఇరాన్ రాయబారిపై లెబనాన్ బహిష్కరణ వేటు - Tholi Paluku