
ఇరాన్ నౌకల మార్పిడి వార్తలు అవాస్తవం: భారత్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ షరతులు విధించిందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్ స్వాధీనం చేసుకున్న మూడు నౌకలను తిరిగి ఇస్తేనే తమ జలాల నుంచి భారత నౌకలకు అనుమతిస్తామంటూ ఇరాన్ ప్రతిపాదించిందన్న కథనాలు పూర్తిగా నిరాధారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ రకమైన చర్చలు ఇరాన్ అధికారులతో జరగలేదని, అసలు భారత్ వద్ద ఉన్న ఆ మూడు నౌకలు ఇరాన్కు చెందినవి కావు సగదా, వాటిలో ఇరాన్ సిబ్బంది కూడా లేరని ఆయన వివరించారు. అవి చమురు ట్యాంకర్లు కావని, కేవలం సాధారణ నౌకలని ఆయన పేర్కొన్నారు.
చర్చల ద్వారానే పరిష్కారం.. భారత పట్టుదల
హోర్ముజ్ జలసంధిలో ఇంకా చిక్కుకుపోయిన భారత నౌకలను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడమే తమ ప్రథమ లక్ష్యమని జైస్వాల్ తెలిపారు. దీనికోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఫిబ్రవరి 28న ఖమేనీ మరణం తర్వాత మొదలైన ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, అన్ని దేశాలు సంయమనం పాటించాలని భారత్ కోరింది. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ వివాదాన్ని ముగించాలని, యుద్ధం మరింత ముదరకుండా చూడాలని జైస్వాల్ పిలుపునిచ్చారు.
బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్ పాత్ర
ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ ఘర్షణల్లో బ్రిక్స్ సభ్య దేశాలు కూడా భాగస్వాములుగా ఉండటంతో ఏకాభిప్రాయం సాధించడం కష్టంగా మారిందని జైస్వాల్ అంగీకరించారు. అయినప్పటికీ, అందరినీ సమన్వయం చేస్తూ శాంతి కోసం భారత్ కృషి చేస్తోందని చెప్పారు. మరోవైపు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బ్రస్సెల్స్లో యూరప్ దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యి పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తక్షణమే చేపట్టాలని, అప్పుడే అంతర్జాతీయ పరిపాలనలో పారదర్శకత వస్తుందని భారత్ మరోసారి డిమాండ్ చేసింది.
స్వదేశానికి ఇద్దరు భారతీయుల మృతదేహాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రాణాలు కోల్పోయిన భారతీయుల వివరాలను గల్ఫ్ విభాగం జాయింట్ సెక్రటరీ అసీమ్ మహాజన్ వెల్లడించారు. ఒమన్ లోని సోహార్ నగరంలో జరిగిన ఘటనలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలు మంగళవారం జైపూర్కు చేరుకున్నాయి. వారి కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఇరాక్ తీరంలోని బస్రా వద్ద 'సేఫ్సీ విష్ణు' నౌక నుంచి రక్షించిన 15 మంది భారత సిబ్బంది ప్రస్తుతం అక్కడ ఒక హోటల్లో సురక్షితంగా ఉన్నారని, వారిని త్వరలోనే భారత్ తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఆ ఘటనలో చనిపోయిన ఒక భారతీయుడి మృతదేహం తరలింపు కోసం ఇరాక్ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
బాధిత కుటుంబాలకు అండగా ఎంబసీలు
మొత్తం మీద ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు మరణించగా, ఒకరు గల్లంతయ్యారు. ఒమన్ నుంచి ఇద్దరి మృతదేహాలు రాగా, మిగిలిన ముగ్గురి మృతదేహాలను వీలైనంత త్వరగా రప్పించేందుకు ఒమన్, ఇరాక్, యూఏఈలోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం శ్రమిస్తున్నాయని మహాజన్ వివరించారు. గాయపడిన ఇతర భారతీయుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
