Let's talk: editor@tmv.in
ఇరాన్‌లో సద్దుమణిగిన నిరసనలు

ఇరాన్‌లో సద్దుమణిగిన నిరసనలు

Dantu Vijaya Lakshmi Prasanna
18 జనవరి, 2026

ఇరాన్‌లో నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ప్రస్తుతం అక్కడ కొంత ప్రశాంతత నెలకొన్నట్లు కనిపిస్తోంది. అయితే, అరెస్ట్ అయిన నిరసనకారులకు మరణశిక్ష విధించాలని ఒక సీనియర్ కఠినపంథా మతగురువు పిలుపునిచ్చారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన నేరుగా హెచ్చరించడం అక్కడి అధికారుల ఆగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరోవైపు, వందలాది మంది నిరసనకారులకు ఉరిశిక్షలు అమలు చేయనందుకు ఇరాన్ నాయకులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌పై సైనిక దాడి ఆలోచన నుండి ఆయన వెనక్కి తగ్గుతున్నారనే సంకేతాలు దీని ద్వారా కనిపిస్తున్నాయి. శాంతియుత నిరసనకారులను చంపడం లేదా ఉరిశిక్షలు వేయడం జరిగితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు.

అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ ప్రకారం, ఈ అణిచివేతలో ఇప్పటివరకు 3,090 మంది మరణించారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన హింసాకాండ ఇది.

ప్రస్తుత పరిస్థితి చూస్తే టెహ్రాన్‌లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, గత వారం రోజులుగా ఇంటర్నెట్ షట్డౌన్ కొనసాగుతోంది.

ఈ నేపధ్యంలో అయతుల్లా అహ్మద్ ఖతామీ అనే కఠినపంథా మతగురువు ప్రసంగిస్తూ, నిరసనకారులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ట్రంప్ "బంట్లు"గా అభివర్ణించారు. వారిపై కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

నిరసనల్లో 350 మసీదులు, 106 అంబులెన్సులు, వందలాది ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు ప్రకటించారు.

పహ్లావి పిలుపు:

బహిష్కృత ఇరాన్ యువరాజు రెజా పహ్లావి శనివారం నుండి సోమవారం వరకు తిరిగి నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇరాన్ ప్రజలకు సహాయం చేయాలని ఆయన కోరారు.

రష్యా పాత్ర:

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్, అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం సిరియాలో అస్సాద్ పతనం వంటి కారణాల వల్ల రష్యా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇరాన్‌లో సద్దుమణిగిన నిరసనలు - Tholi Paluku