Let's talk: editor@tmv.in
ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

Shaik Mohammad Shaffee
26 సెప్టెంబర్, 2025

ఆస్ట్రేలియాతో కాన్పూర్‌లో సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ గురువారం నియమించింది. ఇది శ్రేయస్‌కి భవిష్యత్తులో సీనియర్ 50 ఓవర్ల వన్డే జట్టుకి నాయకత్వ భాద్యతలు చేపట్టే అవకాశం కల్పించనుంది. అయితే ఆయన వెన్ను నొప్పితో ఆరు నెలల పాటు రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్‌కు దూరంగా ఉండనున్నారు. ఇటీవల బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌కు శ్రేయస్ అయ్యర్ తన వెన్ను నొప్పి కారణంగా లాంగ్ ఫార్మాట్ క్రికెట్‌ ఆడలేనని, దానికి దూరంగా ఉంటానని తెలిపాడు.

ఇండియా-ఏ జట్టులో శ్రేయస్ అయ్యర్‌తో పాటు రవి బిష్ణోయ్, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభసిమ్రాన్ సింగ్, బిగ్ హిట్టర్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, ఆయుష్ బదోని వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం యూఏఈలో ఉన్న హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ అక్టోబర్ 3, 5 తేదీల్లో జరిగే రెండో, మూడో వన్డే మ్యాచ్‌ల కోసం జట్టులో చేరతారు. మరోవైపు అక్టోబర్ 1 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో జరగనున్న ఇరానీ కప్‌ మ్యాచ్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. శ్రేయస్ రెడ్-బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్న నేపథ్యంలో, రజత్ పాటిదార్ ఈ బాధ్యతను స్వీకరించారు.

‘’శ్రేయస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్‌కు ఆరు నెలల విరామం తీసుకోవాలని తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపారు. ఆయన యూకేలో వెన్ను శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నప్పటికీ, లాంగర్ ఫార్మాట్ ఆడే సమయంలో అతడికి మళ్లీ వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ విరామ సమయాన్ని అతడు శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. ఈ నిర్ణయం దృష్ట్యా ఇరానీ కప్‌కు అతడిని ఎంపిక చేయలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి వన్డే కోసం ఇండియా-ఏ జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్‌వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్

2వ, 3వ వన్డేల కోసం ఇండియా-ఏ జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్‌వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు (ఇరానీ కప్)

రజత్ పాటిదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశ్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, సారన్ష్ జైన్

ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ - Tholi Paluku