
ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు
విజయవాడలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మూలనక్షత్రం పర్వదినం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం పర్యవేక్షించారు. ఎంపీ శివనాథ్ ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు, పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, వైద్య వసతులను సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్యూలైన్ల వద్ద ఎంపీ శివనాథ్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి భద్రతా చర్యల పై , ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ (గాంధీ) తో కలిసి భక్తులకు మౌళిక సదుపాయాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నందున తాగునీటి వసతి, పారిశుధ్యం మెరుగు పరచడం, అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని చేయాలని ఎంపీ సూచించారు. భక్తులకు తగిన విశ్రాంతి ప్రాంతాలు, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులతో ఎంపీ శివనాథ్ మాట్లాడారు. ఆలయ సదుపాయాలపై వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. మూలనక్షత్రం రోజు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు తప్పనిసరిగా ఉండాలని ఎంపీ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విజయవాడలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
