
ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేందుకు వేగంగా చర్యలు: వైమానిక శాఖ
ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాల్లో భారీ అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) అత్యవసర చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా విమాన రవాణా వ్యవస్థ వేగంగా స్థిరపడుతోందని, మిగిలిన దేశీయ విమానయాన సంస్థలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇతర అన్ని దేశీయ విమానయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో సజావుగా నడుస్తున్నాయి. ఇండిగో కూడా ఈ రోజు గణనీయమైన మెరుగుదల కనబరిచింది.
డిసెంబరు 5న 706 విమానాలు మాత్రమే నడిపిన ఇండిగో, డిసెంబరు 6న 1,565 విమానాలను నడిపింది. ఆదివారం సాయంత్రం నాటికి 1,650 విమానాల వరకు చేరుకునే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. విమానాలు రద్దు కావడంతో డిమాండ్ పెరిగి, తాత్కాలికంగా టిక్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి. దీన్ని అరికట్టడానికి మంత్రిత్వ శాఖ వెంటనే ధరలపై పరిమితి (ఫేర్ క్యాప్) విధించింది. ఈ ఆదేశం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభావిత మార్గాల్లో ధరలు సాధారణ స్థాయికి దిగివచ్చాయి. అన్ని విమానయాన సంస్థలకు కొత్త ధరల నిర్మాణాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రూ. 610 కోట్ల రీఫండ్
ప్రయాణికుల ఆర్థిక భద్రత కోసం ఇండిగోకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. రద్దైన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు ఈ రోజు సాయంత్రం 8 గంటలలోపు పూర్తి రీఫండ్ ఇవ్వాలి. ఇప్పటివరకు ఇండిగో రూ. 610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసింది. రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవడానికి ఎలాంటి అదనపు ఫీజు విధించరాదు. రీఫండ్, రీబుకింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేశారు. అలాగే గందరగోళంలో ప్రయాణికుల నుంచి వేరైన బ్యాగేజీని 48 గంటల్లోపు ట్రేస్ చేసి, డెలివరీ చేయాలని ఇండిగోకు ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిరంతర కమ్యూనికేషన్ ఉండాలి. ఈ చొరవతో నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 3,000 బ్యాగేజీలను ప్రయాణికులకు అందజేశారు.
నిరంతరం పర్యవేక్షణ
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల డైరెక్టర్లు ఈ రోజు టెర్మినల్స్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, చెక్-ఇన్, సెక్యూరిటీ, బోర్డింగ్ ప్రాంతాల్లో ఎటువంటి రద్దీ లేదని నిర్ధారించారు. విమానాశ్రయాల అధికారులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది సహాయాన్ని మరింత బలోపేతం చేశాయి. మంత్రిత్వ శాఖకు చెందిన 24×7 కంట్రోల్ రూమ్ విమాన కార్యకలాపాలు, విమానాశ్రయ పరిస్థితులు, ప్రయాణికుల సహాయ అవసరాలను సమన్వయం చేస్తూ పనిచేస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, గౌరవం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగినవి అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. విమానయాన వ్యవస్థ మళ్లీ పూర్తి సాధారణ స్థితికి చేరుకునే వరకు అన్ని సరిదిద్దుకునే చర్యలు కొనసాగుతాయని, ప్రయాణికుల హక్కులు, ప్రయోజనాల రక్షణకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది.
