Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Praveen Kumar
3 జనవరి, 2026

ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించారు. ఆదివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ప్రారంభమయ్యే ఐదో, చివరి యాషెస్ టెస్టుతో ఆయన అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు కానుంది.

39 ఏళ్ల ఖవాజా, పాకిస్థాన్‌లో జన్మించి చిన్న వయసులోనే ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడిన మొదటి ముస్లిం ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు యాషెస్ సిరీస్‌లో 3–1 ఆధిక్యంలో ఉండగా, ఇప్పటికే ట్రోఫీని నిలుపుకుంది.

రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఖవాజా తన కెరీర్‌లో ఎదుర్కొన్నట్లు చెబుతున్న జాతి ఆధారిత మూసపద్ధతులపై తీవ్రంగా స్పందించారు. సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన పాకిస్థాన్ మూలాలు , ముస్లిం నేపథ్యం కారణంగా తనను “భిన్నంగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని” తెలిపారు.

“గాయాల విషయంలో నేను నియంత్రించలేని పరిస్థితి ఎదురైంది. అయినా నన్ను సోమరిపోతు, బాధ్యత లేనివాడిగా చిత్రీకరించారు. ఇది నా జీవితమంతా ఎదుర్కొంటున్న అనుభవమే,” అని ఖవాజా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, వెస్ట్ ఇండీస్ వంటి నేపథ్యాలున్న ఆటగాళ్లను స్వార్థపరులు, జట్టుపట్ల నిబద్ధత లేనివారిగా చూపించడం అన్యాయమని ఆయన అన్నారు.

ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఖవాజా వెన్ను నొప్పి కారణంగా పెర్త్ టెస్టుకు దూరమయ్యారు. అనంతరం బ్రిస్బేన్ టెస్టును కూడా మిస్ అయ్యారు. అడిలైడ్ టెస్టుకు తొలుత ఎంపిక కాలేకపోయినా, స్టీవ్ స్మిత్‌కు వర్టిగో సమస్య తలెత్తడంతో తిరిగి జట్టులోకి వచ్చారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 82 పరుగులు ఆయన స్థానం నిలబెట్టాయి.

మ్యాచ్‌కు ముందు గోల్ఫ్ ఆడటం, ఐచ్ఛిక సాధన సెషన్‌కు హాజరు కాకపోవడంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, ఇతర ఆటగాళ్లు ఇదే చేస్తే ‘ఆస్ట్రేలియన్ లారికిన్స్’గా అభివర్ణిస్తారని, తన విషయంలో మాత్రం వ్యక్తిత్వంపైనే దాడి జరిగిందని ఖవాజా ఆవేదన వ్యక్తం చేశారు.

ఖవాజా టెస్టు కెరీర్‌లో విశేషమైన పునరాగమన ఘట్టం ఉంది. 2018లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌పై 171 పరుగులతో తొలి యాషెస్ సెంచరీ సాధించిన ఆయన, 35 ఏళ్ల వయసులో అదే మైదానంలో రెండు సెంచరీలు చేసి మళ్లీ జట్టులో స్థానం సంపాదించారు. తదుపరి రెండేళ్లలో ఏడు సెంచరీలు బాదారు.

ఇప్పటివరకు 87 టెస్టుల్లో 6,206 పరుగులు, 43.49 సగటుతో 16 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2023లో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన సీజన్‌లోనే ఖవాజాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్, ఖవాజాను అత్యంత విశ్వసనీయ ఓపెనర్‌గా అభివర్ణిస్తూ, మైదానంలోనే కాకుండా ఉస్మాన్ ఖవాజా ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.

రిటైర్మెంట్‌పై స్పందించిన ఖవాజా, తన మనసులో ప్రధాన భావం “సంతృప్తి” అని చెప్పారు. “ఆస్ట్రేలియాకు ఇన్ని మ్యాచ్‌లు ఆడటం నా అదృష్టం. నా ప్రయాణం ఎవరికైనా ప్రేరణగా నిలిస్తే చాలు,” అని అన్నారు.