Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్‌కు సాత్విక్ జోడీ, లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి

ఆస్ట్రేలియన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్స్‌కు సాత్విక్ జోడీ, లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి

Shaik Mohammad Shaffee
21 నవంబర్, 2025

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి, మాజీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత లక్ష్యసేన్, పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నెం.3 జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

సాయిరాజ్-చిరాగ్ జోడీ జోరు

డబుల్స్ విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్-చిరాగ్ జోడీ, చైనీస్ తైపీకి చెందిన సు చింగ్-హెంగ్, వు గువాన్-క్సున్ జోడీపై 21-18, 21-11 తేడాతో సులువుగా గెలిచింది. ఈ మ్యాచ్ కేవలం 37 నిమిషాల్లో ముగిసింది. తొలి గేమ్‌లో ఒక దశలో 9-15తో వెనుకబడినప్పటికీ, ఆసియా క్రీడల ఛాంపియన్లైన ఈ భారత జోడీ అనూహ్యంగా పుంజుకుంది. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయి విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఐదో సీడ్ అయిన ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ ఫిఖ్రి, ఫజర్ అల్ఫియన్‌తో తలపడనుంది.

చెమటోడ్చిన లక్ష్యసేన్‌

పారిస్ 2024 సెమీ ఫైనలిస్ట్ అయిన లక్ష్యసేన్ (ప్రపంచ ర్యాంకింగ్ 14), క్వార్టర్స్‌కు చేరుకోవడానికి చైనీస్ తైపీ ఆటగాడు చి యు-జెన్‌తో గంటకు పైగా పోరాడాల్సి వచ్చింది. లక్ష్యసేన్ 21-17, 13-21, 21-13 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో లక్ష్యసేన్ వరుసగా ఏడు గేమ్ పాయింట్‌లను కోల్పోయినా, చివరికి గెలిచాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. అందులో లక్ష్యసేన్ పైచేయి సాధించాడు.

మరోవైపు ఈ ఏడాది యోనెక్స్ యూఎస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన 20 ఏళ్ల ఆయుష్ శెట్టి , ప్రపంచ నెం.9 జపాన్ ఆటగాడు కొడై నరావోకాను మరోసారి ఓడించి సంచలనం సృష్టించాడు. ఆయుష్ 21-17, 21-16 తేడాతో గెలిచాడు. ఈ ఏడాదిలో నరావోకాపై ఆయుష్‌కు ఇది రెండో విజయం. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్‌లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి (ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు) తలపడనున్నారు. వీరిలో గెలిచినవారు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటారు.

సీనియర్ ఆటగాళ్లకు నిరాశ

ఆసియా క్రీడల పతక విజేత, సీనియర్ ఆటగాడు, ప్రపంచ నెం. 35 అయిన హెచ్.ఎస్. ప్రణయ్ నిరాశపరిచాడు. ఈ ఏడాది ప్రీ-క్వార్టర్స్‌కు మించి ముందుకు వెళ్లలేకపోయిన ప్రణయ్, ఎనిమిదో సీడ్ అయిన ఇండోనేషియాకు చెందిన ఫర్హాన్ అల్వి చేతిలో 19-21, 10-21 తేడాతో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. మాజీ ప్రపంచ నెం. 1 కిదాంబి శ్రీకాంత్ కూడా శుభారంభం చేయలేకపోయాడు. జపాన్‌కు చెందిన షోగో ఒగావా చేతిలో 20-22, 16-21 తేడాతో ఓడి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.