
ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఇబ్బందులు తొలగించాలి: సోనియాగాంధీ
ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద పనిచేస్తున్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ మంగళవారం రాజ్యసభలో ప్రశ్నలు లెవనెత్తారు. ప్రభుత్వంలోని కీలక పథకాలను అమలు చేస్తున్న మహిళా కార్మికులు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద పనిచేస్తున్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఈ సభ తక్షణమే దృష్టి సారించాలని అన్నారు. ఈ పథకాలు మహిళల సాధికారతకు మార్గాలుగా రూపొందించారని పేర్కొన్న ఆమె, ప్రజా సేవల పంపిణీలో వీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ మహిళా కార్మికులు అధిక పనిభారంతో పాటు తక్కువ వేతనాలతో పని చేయాల్సి వస్తోంది అని చెప్పారు.
సామాజిక భద్రత కల్పించండి
దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు టీకాల కార్యక్రమం, ప్రజల సమీకరణ, మాతృ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ, వారికి గౌరవ వేతనం చాలా తక్కువ మాత్రమే లభిస్తోంది. సామాజిక భద్రత కూడా చాలా పరిమితంగా ఉందని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల విషయాన్ని ప్రస్తావిస్తూ, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం నెలకు కేవలం రూ.4,500 మాత్రమే, హెల్పర్లకు రూ.2,250 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తోందని చెప్పారు. సిబ్బంది కొరత వల్ల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆమె పేర్కొన్నారు. తక్కువ వేతనాలతో పాటు, ఐసీడీఎస్ పథకంలో వివిధ స్థాయిల్లో దాదాపు మూడు లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల కారణంగా లక్షలాది పిల్లలు, తల్లులు అత్యవసర సేవల నుంచి వంచితులవుతున్నారు. ఈ పోస్టులు భర్తీ చేసినా, 2011 తర్వాత జనగణన జరగకపోవడం వల్ల జనాభా ప్రమాణాలకు సరిపోవడం లేదని ఆమె అన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ కోరారు. ఆమె సూచించిన ముఖ్యమైన అంశాలు
• ఐసీడీఎస్లో ఉన్న అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయడం
• అన్ని కార్యకర్తలకు సమయానికి వేతనాలు అందేలా చూడడం
• ఫ్రంట్లైన్ మహిళా కార్మికుల వేతనాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను రెండింతలు చేయడం
• జనాభా 2,500కు మించి ఉన్న గ్రామాల్లో అదనంగా ఒక ఆశా కార్యకర్తను నియమించడం
• పోషణ, ఆరోగ్య సేవలతో పాటు ప్రీ-స్కూల్ విద్యను సమర్థంగా అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తల సంఖ్యను రెండింతలు చేయడం
ఈ కార్మిక బలగాన్ని బలోపేతం చేయడం, విస్తరించడం, వారికి పూర్తి మద్దతు ఇవ్వడం అనేది భారతదేశ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడమే అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘సబ్కా బీమా సబ్కీ రక్షా (బీమా చట్టాల సవరణ) బిల్లు–2025ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా బీమా చట్టం–1938, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం–1956, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–1999లకు సవరణలు ప్రతిపాదించారు.
