
ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో థానే కోర్టుకు రాహుల్ గాంధీ హాజరు
ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త ష్యూరిటీగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ మరణించడంతో ఈ న్యాయ ప్రక్రియ అవసరమైంది. థానే జిల్లాలోని భివండి మేజిస్ట్రేట్ కోర్టు, గతంలో గాంధీకి ష్యూరిటీగా ఉన్న శివరాజ్ పాటిల్ డిసెంబర్ 12న మరణించడంతో, కొత్త ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. 2016లో గాంధీ బెయిల్ పొందినప్పుడు పాటిల్ గ్యారంటీగా నిలిచారు.న్యాయస్థానం ఆదేశాల మేరకు, కొత్త ష్యూరిటీ సంబంధిత ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి గాంధీ స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
శనివారం ఉదయం సుమారు 11 గంటలకు గాంధీ, సప్కాల్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయవాదులు నారాయణ అయ్యర్, కుశాల్ మోర్ సమక్షంలో సప్కాల్ను కొత్త ష్యూరిటీగా ప్రవేశపెట్టారు. కోర్టు మహారాష్ట్ర కాంగ్రెస్ నేత వివరాలను ధృవీకరించి, ష్యూరిటీ బాండ్పై సంతకం చేయించడంతో ప్రక్రియ పూర్తైంది.
కేసు నేపథ్యం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త రాజేష్ కుంటే 2014 లోక్సభ ఎన్నికల సమయంలో సోనాలే గ్రామంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆ సభలో ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ హత్యకు కారణమని గాంధీ వ్యాఖ్యానించారని, అది సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని కుంటే ఆరోపించారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 (పరువు నష్టం) కింద ఈ కేసు నమోదు అయింది. కోర్టు తదుపరి విచారణ తేదీని తరువాత ప్రకటించనుంది.
నాయకులతో సమావేశం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ముంబైలో పార్టీ నేతలతో మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించి, జనవరి 15న జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన నిరాశాజనక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీఎంసీ ఫలితాలపై ఆత్మపరిశీలన
మధ్యాహ్న భోజన సమావేశం నగరంలోని ఒక హోటల్లో జరిగింది. ఇందులో సప్కాల్తో పాటు ముంబై కాంగ్రెస్ చీఫ్, లోక్సభ ఎంపీ వర్షగైక్వాడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో 227 స్థానాల్లో కేవలం 24 సీట్లు మాత్రమే గెలుచుకోవడంపై గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు. మహా వికాస్ అఘాడి మిత్రపక్షాలు అయిన శివసేన (యూబీటీ), ఎన్సీసీ(శరద్ పవార్)లతో కలిసి కాకుండా ఒంటరిగా పోటీ చేయడం సరైన నిర్ణయమా? అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన గాంధీ, ముంబై యూనిట్ను క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు వర్గాలు తెలిపాయి. సప్కాల్తో ప్రత్యేకంగా వన్-ఆన్-వన్ సమావేశం కూడా నిర్వహించారు.
