
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు జైషే మహిళా బ్రిగేడ్ ఏర్పాటు?
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ నుంచి కోలుకునేందుకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద ముఠా జైష్-ఏ-మహ్మద్ (జెఎం) కొత్త పన్నాగాలు పన్నుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో కకావికలమైన మసూద్ అజార్ ముఠా తొలిసారిగా తమ నెట్వర్క్ను విస్తరించుకునేందుకు ప్రత్యేక మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
కోలుకునేందుకు కొత్త ఎత్తుగడ
‘ఆపరేషన్ సిందూర్’లో బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత సైన్యం బాంబులు జారవిడచడంతో అది దారుణంగా ధ్వంసమైంది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన దాదాపు 10 మంది మృతి చెందారు. మృతులలో మసూద్ బావ సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నట్లు జెఎం కమాండర్ ఇటీవల ధ్రువీకరించాడు. ఈ ఊహించని నష్టం నుంచి త్వరితగతిన కోలుకునేందుకు తమ ఉగ్ర కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు మసూద్ అజార్ తన సోదరుడు తల్హా అల్-సైఫ్తో కలిసి ఈ కొత్త పథకానికి రూపకల్పన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం.
మహిళా యూనిట్లో ఎవరెవరు?
మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ మహిళా బ్రిగేడ్లో జెఎం కమాండర్ల భార్యలను సభ్యులుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్ వంటి పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలను నియమించుకోవాలని ముఠా లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఐసిస్, బోకో హరామ్, హమాస్ వంటి ఉగ్ర సంస్థలు కూడా మహిళలను నియమించుకుని ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు జైషే కూడా అదే ప్రమాదకరమైన పంథాను అనుసరించేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మదర్సాలోని యువతులే టార్గెట్
బహవల్పూర్లోని జెఎం ప్రధాన కేంద్రంలో ఈ మహిళా బ్రిగేడ్ కోసం నియామకాలు ఇప్పటికే అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లో జెఎం కమాండర్ల భార్యలతో పాటు, బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్, మన్సేహ్రా వంటి ప్రాంతాల్లోని మదర్సాలలో చదువుతున్న యువతులు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను చేర్చుకోవాలని జెఎం భావిస్తోంది. ఈ మహిళలను గూఢచారులుగా, ఆత్మాహుతి దాడులకు ఉపయోగించుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గతంలో ఐఎస్ఐఎస్, బోకో హరామ్, హమాస్ వంటి ఉగ్రసంస్థలు మహిళలను తమ కార్యకలాపాల్లో భాగం చేసుకుని ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జెఎం కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
భారత్లో విస్తరణపై ఆందోళన
ఈ కొత్త మహిళా బ్రిగేడ్ ఏర్పాటుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ యూనిట్ సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్లను ఉపయోగించి భారత్లో ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి సున్నిత ప్రాంతాల్లో తమ నెట్వర్క్ను విస్తరించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ బ్రిగేడ్లో చేరేలా ఆకర్షించే ప్రమాదం ఉన్నందున భారత అధికారులు ఇప్పటికే అప్రమత్తమై, రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిణామం భారత భద్రతా వ్యవస్థకు కొత్త సవాలుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
