Let's talk: editor@tmv.in
ఆటో రిక్షాలకు ఎల్పీజీ కొరత: కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

ఆటో రిక్షాలకు ఎల్పీజీ కొరత: కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

Gaddamidi Naveen
1 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ఆటో రిక్షాలు ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఆయన మంగళవారం అత్యవసర లేఖ రాశారు.

గృహ వినియోగ అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సరఫరాను సుమారు 10 శాతం స్థాయిలో నిర్వహిస్తున్నామని, వాణిజ్య ఎల్పీజీ పంపిణీ కూడా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నియంత్రణలో ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ పరిమితుల ప్రభావం రాష్ట్రంలోని ఆటో ఎల్పీజీ విభాగంపై ఎక్కువగా పడిందని ఆయన అన్నారు.

తెలంగాణలో దాదాపు ఒక లక్ష ఎల్పీజీ ఆటోరిక్షాలు నడుస్తున్నాయని, వీటికి సరిపడా ఇంధనం అందకపోవడం వల్ల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కలిపి సుమారు 20 శాతం వాటాతో 33 ఔట్‌లెట్లు నిర్వహిస్తుండగా, ప్రైవేట్ సంస్థలు 110 ఔట్‌లెట్లతో 80 శాతం మార్కెట్‌ను ఆక్రమించి ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీ కొరత నెలకొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొరత కారణంగా ఎక్కువ ప్రైవేట్ ఔట్‌లెట్లు ఖాళీ అవుతూ ఉండటం వల్ల ఆటోరిక్షాల సేవలు అంతరాయం కలుగుతున్నాయని, దాంతో ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతోందని తెలిపారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ రంగ ఔట్‌లెట్లలో ఆటో ఎల్పీజీ సరఫరాను పెంచాలని, అలాగే ప్రైవేట్ పంపిణీదారులకు లోటును భర్తీ చేసేలా ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలకు తక్షణ సూచనలు ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ ఔట్‌లెట్లలో లీటరు ఆటో ఎల్పీజీ ధర రూ.75గా ఉండగా, ప్రైవేట్ సంస్థలు రూ.93 వరకు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ సంస్థలు అనవసరంగా ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కేంద్రానికి సూచించారు. ఆటో రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తక్షణమే స్పందించాలని ఆయన లేఖలో విన్నవించారు.