Let's talk: editor@tmv.in
ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తప్పవు: డీకే శివకుమార్

ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తప్పవు: డీకే శివకుమార్

Pinjari Chand
31 డిసెంబర్, 2025

బెంగళూరు ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతం (కోగిలు)లో కూల్చివేతలపై చెలరేగిన వివాదం మధ్య, ఆక్రమణలపై కర్ణాటక ప్రభుత్వ వైఖరి స్పష్టమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అక్రమంగా భూములు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎలాంటి రాజీ లేదా బుజ్జగింపు రాజకీయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ అక్రమంగా ఆక్రమించకూడదు. ఆక్రమణదారులకు బహుమతులు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేం. బుజ్జగింపు రాజకీయాలకు ఎలాంటి చోటు లేదని శివకుమార్ మంగళవారం అన్నారు. కోగిలు కూల్చివేతలతో ప్రభావితమైన వారిలో మానవత్వం దృక్పథంతో అర్హులైన వారికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

ముస్లింలను బుజ్జగిస్తున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఎవరినీ బుజ్జగించడం లేదు. అక్రమ ఆక్రమణకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. కొందరు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుంది. మానవీయంగా అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు అందిస్తాం అని పేర్కొన్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో హక్కు పత్రాలు జారీ అయ్యాయన్న వాదనలపై ధృవీకరణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా చేరినట్టు పేర్కొంటూ, పత్రాల పరిశీలన తర్వాత స్థానిక ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు, నిజమైన స్థానిక చిరునామా కలిగినవారిని గుర్తించి పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం

కర్ణాటక వ్యవహారాల్లో జోక్యం వద్దన్న పిలుపును ఖండిస్తూ కొందరు కేరళ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శివకుమార్ తమ గత హామీలను నెరవేర్చని వారు ఇక్కడ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. మా రాష్ట్ర సమస్యలను మేమే సమర్థంగా పరిష్కరించుకుంటామన్నారు. అక్రమ నివాసాలను క్రమబద్ధీకరిస్తున్నారా అన్న ప్రశ్నకు, క్రమబద్ధీకరణ లేదు. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు. స్థానిక ఓటరు జాబితాలో పేరు, నిజమైన చిరునామా ఉన్నవారినే గుర్తించి ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ, కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం, పక్కా ఇళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమావేశం అనంతరం అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోమవారం కోగిలు అక్రమ ఆక్రమణలపై కూల్చివేతలను కేరళ సీఎం పినరయి విజయన్ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వ్యాఖ్యలు చేస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు.