
ఆంధ్రా వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాను
నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడింది. దీని కారణంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీఎస్డీఎంఏ ప్రకారం, ఈ వాతావరణ వ్యవస్థ ఉత్తర వాయువ్యం వైపు కదులుతూ, తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
"దిత్వ తుఫాను ఏర్పడి, మరింత బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది" అని ఏపీఎస్డీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వ్యవస్థ నవంబర్ 29 సాయంత్రం నుండి నవంబర్ 30 ఉదయం మధ్య నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు కదలవచ్చని అంచనా వేయబడింది. తుఫాను ప్రభావం కారణంగా శనివారం నుండి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో నవంబర్ 29 నుండి రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో సముద్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
దక్షిణ రాష్ట్రంలోని పలు మండలాల్లో బలమైన గాలులు, తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను తీవ్రమవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
అత్యవసర ప్రతిస్పందనలను సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల వారికి హెచ్చరికలు పంపుతున్నామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, తుఫాను తీరానికి చేరువవుతున్న కొద్దీ మరింత బలపడే అవకాశం ఉందని, వర్షపాతం, గాలుల ప్రభావం గణనీయంగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను శ్రీలంకలోని బట్టికలోవా, హంబంటోటాకు వాయువ్యంగా, పుదుచ్చేరికి 640 కి.మీ వాయువ్యంగా మరియు చెన్నైకి 730 కి.మీ వాయువ్యంగా కేంద్రీకృతమై ఉంది.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులన్నారు.
ఎక్కడా పాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు.
