
అస్సాం బీజేపీలో అసంతృప్తి జ్వాలలు
అసెంబ్లీ ఎన్నికల ముందు అస్సాం బీజేపీలో టికెట్ కేటాయింపులు తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. టికెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు, ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తుండగా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ప్రద్యుత్ బోర్డోలోయ్, భూపెన్ బోరాలకు వరుసగా డిస్పూర్, బిహ్పురియా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఇవ్వడం పార్టీ లోపల అసంతృప్తిని మరింత పెంచింది.
డిస్పూర్లో తిరుగుబాటు స్వరం
డిస్పూర్లో సీనియర్ నేత జయంత దాస్కు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆయన బహిరంగంగా సీఎం శర్మపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీని కాంగ్రెస్ బీజేపీగా మార్చారని ఆరోపించారు. పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అతుల్ బోరాకు కూడా టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
ఇతర ప్రాంతాల్లోనూ అసంతృప్తి
న్యూ గువాహటి, గువాహటి సెంట్రల్ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి వెల్లువెత్తింది. బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ భట్టాచార్య, ఏజీపీకి చెందిన రమేంద్ర నారాయణ కలితాలకు టికెట్లు ఇవ్వలేదు. వారికి నచ్చజెప్పడానికి సీఎం వారి ఇళ్లకు వెళ్లి చర్చలు జరిపారు. సిద్ధార్థ భట్టాచార్య స్థానంలో డిప్లూ రంజన్ శర్మను, కలితా స్థానంలో విజయ్ గుప్తాను నిలబెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
బిహ్పురియాలో అసంతృప్తి జ్వాలలు
బిహ్పురియా నియోజకవర్గంలో భూపెన్ బోరాకు టికెట్ ఇవ్వడంతో, ప్రస్తుత ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా పోటీ చేయాలా అనే అంశంపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
సోనారి, బరక్ లోయలోనూ గుసగుసలు
మాజీ ఎంపీ టోపన్ కుమార్ గోగోయ్ కూడా సోనారి నుంచి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. బరక్ లోయలోని డోలై, సిల్చర్, ఉదర్భండ్ ప్రాంతాల్లోనూ టికెట్లు రాకపోవడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం తన కేబినెట్ సహచరుడు జయంత మల్ల బరువాను పంపి పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే ఈ పరిస్థితిని సీఎం శర్మ తక్కువ చేసి చూపించారు. మొత్తం 1,400 మంది టికెట్లు ఆశించారు. అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ. ఎవరూ పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేయరని చెప్పారు.
కాంగ్రెస్ విమర్శలు
ఇదిలా ఉండగా, అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ శర్మ నాయకత్వంలో బీజేపీ అసలు కాంగ్రెస్ పార్టీలా మారిపోయిందని ఆరోపించారు. బీజేపీ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తుండగా, 2015 తర్వాత పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకుల్లో 28 మందికి టికెట్లు కేటాయించడం గమనార్హం.అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తంగా, టికెట్ల కేటాయింపుతో బీజేపీలో చెలరేగిన అసంతృప్తి, ఎన్నికల ముందు పార్టీకి సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
