Let's talk: editor@tmv.in
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించం: సీఈసీ

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించం: సీఈసీ

Pinjari Chand
11 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు జాబితా నుంచి తొలగించమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఙానేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, శాంతియుత ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం కొల్‌కత్తాలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎప్పటికీ శాంతియుత, ప్రజాస్వామ్య విధానాన్ని విశ్వసిస్తారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడమే మా లక్ష్యం. అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని ఆయన స్పష్టం చేశారు.

ఓటరు జాబితా పునర్విమర్శ ప్రక్రియ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందని సీఈసీ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యమని చెప్పారు. ఓటు హక్కుకు అర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండాలి. అర్హత లేని వారి పేర్లు మాత్రం తొలగించాలి. అదే ఈ ప్రక్రియ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో కొంత డేటా వ్యత్యాసం బయటపడిందని చెప్పారు. వివరాల ప్రకారం, ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సమర్పించిన తర్వాత సుమారు 4–5 శాతం ఓటర్లు 2002 ఓటరు జాబితాతో సరిపోలలేదు. వీరిని ‘అన్‌మ్యాప్‌డ్ ఎలెక్టర్స్’గా గుర్తించారని తెలిపారు. అలాగే 7–8 శాతం మంది ఓటర్లు తప్పుగా మ్యాప్‌ అయ్యారు, ఇది కావాలనే చేసిన ప్రయత్నం కావచ్చు లేదా అనుకోకుండా జరిగిన పొరపాటు కావచ్చని ఆయన వివరించారు.

పరిశీలనలో వేలాది కేసులు

పశ్చిమ బెంగాల్‌లో ఇంకా అనేక కేసులు పరిశీలనలో ఉన్నాయని సీఈసీ తెలిపారు. ముఖ్యంగా ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌‌వో), సహాయ అధికారి (ఏఈఆర్ఓ) స్థాయిలో కొన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘అండర్ అడ్జుడికేషన్’ కేటగిరీలో ఉన్న పేర్లపై సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయాధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 28న సవరించిన ఓటరు జాబితా విడుదల చేసిన అనంతరం, అదనపు జాబితాలను కూడా త్వరలో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

టీఎంసీ ఆరోపణలు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అధికార పార్టీ ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర ఆరోపణలు చేసింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత దాదాపు 64 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని, మరో 60 లక్షల మందిని పరిశీలనలో ఉంచారని టీఎంసీ ఆరోపించింది. అయితే రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్పందించడం ఎన్నికల సంఘానికి తగదని సీఈసీ అన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగం ప్రకారం మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.

ఎన్నికల దశలపై నిర్ణయం తరువాత

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలన్నది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించి నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. సమావేశాల వివరాలతో ఢిల్లీకి వెళ్లిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో హింస, ఓటర్లను లేదా ఎన్నికల అధికారులను బెదిరించే ప్రయత్నాలపై ఎన్నికల సంఘం జీరో సహనం పాటిస్తుందని హెచ్చరించారు.

80 వేల పోలింగ్ కేంద్రాలు

పశ్చిమ బెంగాల్‌లో సుమారు 80 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో దాదాపు 61 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ తెలిపారు. పారదర్శకత కోసం రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నినాదంగా ‘చునావ్ పోర్బో, పశ్చిమ్ బంగేర్ గోర్బో’ (ఎన్నికల పర్వం పశ్చిమ బెంగాల్ గర్వం) అనే నినాదాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ అంశం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ప్రతిపక్షాలు, అధికార పార్టీ మధ్య ఓటర్ల పేర్ల తొలగింపు, జాబితా మార్పులపై పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

యువ ఓటర్లతో సీఈసీ సమావేశం… ఎలక్షన్ కార్డుల పంపిణీ

రాబోయే ఎన్నికల నేపథ్యంలో సమీక్ష పర్యటనలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ యువతతో, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా పాల్గొన్నారు. సమావేశంలో యువ ఓటర్లతో సంభాషించిన ఎన్నికల కమిషన్ అధికారులు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల ప్రక్రియలో యువత చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన యువ ఓటర్లకు ఎలక్టర్‌‌ ఫోటో ఐడెంటీటీ కార్డు (ఈపీఐసీ) కార్డులను అందజేశారు. ఎన్నికలపై అవగాహన పెంచడం, యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఎన్నికల సంఘం తెలిపింది.

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించం: సీఈసీ - Tholi Paluku