
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే: కేంద్ర విదేశాంగ శాఖ
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారతదేశ వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టంగా పేర్కొంది. "అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది, ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటుంది. ఈ విషయంలో ఎవరి జోక్యం మాకు అవసరం లేదు" అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఈ సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూనే, ఇటీవల చైనా విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటనపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక భారతీయ పౌరురాలిని షాంఘై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, చైనా గుండా ప్రయాణించే భారతీయ ప్రయాణీకులకు ప్రభుత్వం కీలక అడ్వయిజరీ జారీ చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న ప్రేమ వాంగ్జోమ్ థాంగ్దోక్ అనే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్ను నవంబర్ 21న షాంఘై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె లండన్ నుంచి జపాన్కు వెళ్తుండగా షాంఘైలో కొద్దిసేపు ఆగి వెళ్లాల్సి ఉంది.
చైనా ఆరోపణ
ఆమె పుట్టిన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ కావడంతో, చైనా అధికారులు ఆమె ప్రయాణ పత్రాల చెల్లుబాటుపై అనుమానం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని వారు ఆరోపించారు. ఈ చేదు అనుభవాన్ని ఆమె చైనా నుంచి బయలుదేరిన తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. షాంఘై సంఘటన జరిగిన రోజునే (నవంబర్ 24) న్యూఢిల్లీ, బీజింగ్లలోని చైనా అధికారులకు భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరాన్ని తెలియజేసింది.
విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, చైనా అంతర్జాతీయ విమానయాన నియమాలను పాటించాలని భారత్ ఆశిస్తోందని అన్నారు. చైనా విమానాశ్రయాలలో భారతీయ పౌరులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోకుండా, అక్రమంగా నిర్బంధించకుండా లేదా వేధించకుండా ఉండేలా హామీ ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు.
చైనా అధికారుల ఇటువంటి చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ప్రక్రియకు అనవసరమైన అడ్డంకులను సృష్టిస్తున్నాయని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లడఖ్లోని సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్న తర్వాత గత ఏడాది కాలంలో ఢిల్లీ-బీజింగ్ల మధ్య సంబంధాలు నెమ్మదిగా మెరుగుపడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
అసలు సమస్య ఏంటి?
అరుణాచల్ ప్రదేశ్ను చైనా తన భూభాగంగా (దక్షిణ టిబెట్/ 'జాంగ్నాన్') పేర్కొనడం ఈ వివాదానికి మూల కారణం. భారత్ మాత్రం ఇది "భారతదేశంలో అంతర్భాగం, ఎప్పటికీ అలాగే ఉంటుంది" అని స్పష్టం చేస్తోంది. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య కుదిరిన మెక్మహోన్ లైన్ ఒప్పందాన్ని చైనా అంగీకరించకపోవడం వల్ల ఈ సమస్య మొదలైంది. 1962 యుద్ధం తర్వాత కూడా చైనా ఈ ప్రాంతాన్ని తన మ్యాప్లలో దక్షిణ టిబెట్గా చూపిస్తూనే ఉంది.
2020 లడఖ్ ఘర్షణల తర్వాత చైనా దూకుడు పెంచింది. ఇది అరుణాచల్లోని ప్రాంతాలకు కొత్తగా చైనా పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో శాశ్వత గ్రామాలు నిర్మించడం, భారత నాయకుల పర్యటనలను తీవ్రంగా విమర్శించడం వంటి చర్యలు తీసుకుంది. ఇటీవల ఒక భారతీయ మహిళను షాంఘై ఎయిర్పోర్ట్లో, ఆమె పాస్పోర్ట్పై పుట్టిన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటం వల్ల, అడ్డుకోవడం ఈ ఉద్రిక్తతకు తాజా నిదర్శనం.
శాశ్వత పరిష్కారం కోసం నిపుణులు 'ప్యాకేజ్ డీల్' (అరుణాచల్ను భారత్కు ఇచ్చి, అక్సాయ్ చిన్ను చైనాకు ఇవ్వడం), లేదా ఎల్ఏసీని స్పష్టంగా గుర్తించడం వంటి మార్గాలను సూచిస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తి పరిష్కారం కష్టమే అయినప్పటికీ, చర్చలు, బఫర్ జోన్లు ఏర్పాటు చేయడం, దౌత్యపరమైన సంభాషణలు కొనసాగించడమే యుద్ధానికి దూరంగా ఉండటానికి ఏకైక మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
