
అమెరికా ఎంపీలతో జైశంకర్ భేటీ
భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కొనసాగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం అమెరికా కాంగ్రెస్కు చెందిన ముగ్గురు సభ్యులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, వాణిజ్యం, ఆర్థిక అంశాలు, కీలక సాంకేతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందంలో జిమ్మీ పాట్రోనిస్, మైక్ రోజర్స్, ఆడమ్ స్మిత్ ఉన్నారు. ఈ భేటీలో భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా పాల్గొన్నారు. భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైశంకర్ అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో మంచి పరస్పర చర్చ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలు, ఇండో–పసిఫిక్ ప్రాంత పరిణామాలు, ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించాం. కాంగ్రెస్ స్థాయి పరస్పర సమావేశాలు ఎప్పుడూ మా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా ఈ సమావేశాన్ని ఫలప్రదమైన చర్చలుగా అభివర్ణించారు. భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారంపై చర్చించామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సమావేశం, ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బైలేటరల్ ట్రేడ్ డీల్)పై చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న సమయంలో జరిగింది. గత ఏడాది ఇరు పక్షాలు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ, భారత్ మార్కెట్లలోకి అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను సులభంగా అనుమతించాలి అన్న డిమాండ్ల కారణంగా ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు.
ఇటీవలి కాలంలో భారత్–అమెరికా సంబంధాల్లో కొంత ఒత్తిడి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్పై అదనంగా 25 శాతం టారిఫ్ విధించడం ఇందుకు కారణమయ్యాయి. అలాగే, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అమెరికా కొత్త వలస విధానాలు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిన అంశాలుగా ఉన్నాయి. అయితే, ఈ భేటీ ద్వారా ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని కొనసాగిస్తూ, భద్రతా సవాళ్లు, ఆర్థిక సంబంధాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలపై కలిసి పనిచేయాలన్న సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
