
అమెరికాలో ‘టిక్టాక్’ నిషేధం రద్దు.. కొత్త కంపెనీగా మార్పు
కోట్లాది మంది అమెరికన్లు వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్'పై గత కొన్నేళ్లుగా ఉన్న నిషేధ గండం తొలగిపోయింది. టిక్టాక్ మాతృసంస్థ అయిన చైనాకు చెందిన 'బైట్డ్యాన్స్' అమెరికా ప్రభుత్వంతో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక కొత్త "జాయింట్ వెంచర్" కంపెనీని ఏర్పాటు చేశారు. దీనివల్ల 20 కోట్ల మంది అమెరికన్ వినియోగదారులు ఎప్పటిలాగే యాప్ను వాడుకోవచ్చు.
అమెరికా చేతుల్లోకి యాజమాన్య హక్కులు
ఈ కొత్త ఒప్పందం ప్రకారం టిక్టాక్ ఇకపై పూర్తిగా చైనా కంపెనీగా ఉండదు. దీని యాజమాన్యంలో మెజారిటీ వాటా అమెరికా పెట్టుబడిదారులకే ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ఈ సంస్థలో 80.1 శాతం వాటా అమెరికా, ఇతర అంతర్జాతీయ పెట్టుబడిదారులది. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ వాటా కేవలం 19.9 శాతానికి పడిపోయింది. ఒరాకిల్, సిల్వర్ లేక్, అబుదాబికి చెందిన ఎంజీఎక్స్ వంటి పెద్ద కంపెనీలు ఇందులో ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఇవేకాకుండా డెల్ ఫ్యామిలీ ఆఫీస్, ఆల్ఫా వేవ్ పార్ట్నర్స్, రెవల్యూషన్, ఎన్జెజే క్యాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలు కూడా ఇందులో భాగస్వాములయ్యాయి.
ట్రంప్ హర్షం.. చైనా అధ్యక్షుడికి ధన్యవాదాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, “టిక్టాక్ ఇప్పుడు గొప్ప అమెరికన్ పెట్టుబడిదారుల చేతుల్లోకి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ఒప్పందానికి ఆయన అంగీకరించడం అభినందనీయం” అని ట్రంప్ పేర్కొన్నారు. తన ఎన్నికల విజయంలో టిక్టాక్ కీలక పాత్ర పోషించిందని, యువతకు ఇది ఒక ముఖ్యమైన వేదిక అని ట్రంప్ కొనియాడారు.
డేటా భద్రతకు పెద్దపీట
అమెరికా వినియోగదారుల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తుందనే ఆందోళనతోనే ఇంతకాలం నిషేధం విధించాలని చూశారు. ఇప్పుడు కొత్త కంపెనీ 'టిక్టాక్ యూఎస్డీఎస్' ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. అమెరికన్ల డేటా అంతా అమెరికాలోనే భద్రంగా ఉండేలా 'ఒరాకిల్' క్లౌడ్ సేవలను వాడుకుంటారు. యాప్ పనితీరును నిర్దేశించే 'అల్గారిథమ్' కూడా ఇకపై అమెరికా పర్యవేక్షణలోనే ఉంటుంది.
కొత్త బాధ్యతలు.. కొత్త పాలన
ఈ కొత్త సంస్థకు ఆడమ్ ప్రెసర్ సీఈఓగా, విల్ ఫారెల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమితులయ్యారు. వీరిద్దరూ గతంలో టిక్టాక్లో కీలక బాధ్యతలు నిర్వహించిన వారే. టిక్టాక్ గ్లోబల్ సీఈఓ శౌ జి చూ కూడా ఈ కొత్త కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉంటారు. వ్యాపార కార్యకలాపాలు, అడ్వర్టైజింగ్, ఈ-కామర్స్ వంటి విభాగాలను బైట్డ్యాన్స్ విడిగా చూసుకుంటుంది. మొత్తంగా ఈ ఒప్పందం ద్వారా టిక్టాక్ అమెరికాలో కొనసాగేందుకు మార్గం సుగమమవగా, డేటా భద్రతపై అమెరికా ఆందోళనలకు కూడా పరిష్కారం లభించినట్టైంది.
