Let's talk: editor@tmv.in
అమెరికాలో ‘జాతీయ ఓటరు జాబితా’కు ట్రంప్‌ ఆదేశం

అమెరికాలో ‘జాతీయ ఓటరు జాబితా’కు ట్రంప్‌ ఆదేశం

Shaik Mohammad Shaffee
2 ఏప్రిల్, 2026

అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్లందరితో కూడిన ఒక 'జాతీయ ఓటరు జాబితా'ను రూపొందించాలని ఆదేశిస్తూ మంగళవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ప్రతి రాష్ట్రంలోని అర్హులైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఈ ఉత్తర్వు పేర్కొంది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో, ట్రంప్ నిర్ణయం కోర్టుల్లో నిలవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాలెట్ల పంపిణీపై ఆంక్షలు

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం రూపొందించే ఈ అధికారిక జాబితాలో పేరు లేని వారికి పోస్టల్ సర్వీస్ ద్వారా 'ఆబ్సెంటీ బ్యాలెట్లను' పంపకూడదని ట్రంప్ ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ట్రాక్ చేయడానికి వీలుగా ప్రత్యేక బార్‌కోడ్‌లతో కూడిన సురక్షితమైన ఎన్వలప్‌లను వాడాలని సూచించారు. ఈ విధానం చాలా బాగుంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ, పోస్టల్ సర్వీస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. గత మార్చిలో కూడా ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటు నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని, మెయిల్ బ్యాలెట్లు ఎన్నికల రోజే అందాలని ఆయన కోరగా.. మెజారిటీ నిబంధనలను కోర్టులు ఇప్పటికే అడ్డుకున్నాయి.

రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు

అమెరికాలో ఎన్నికల ప్రక్రియ వికేంద్రీకృతంగా ఉంటుంది. వేల సంఖ్యలో చిన్న టౌన్‌షిప్‌ల నుంచి పెద్ద నగరాల వరకు స్థానిక అధికారులే ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని 'ఎలక్షన్స్ క్లాజ్' ప్రకారం ఎన్నికల నిబంధనలను మార్చే అధికారం కాంగ్రెస్ (పార్లమెంటు)కు మాత్రమే ఉంటుంది తప్ప అధ్యక్షుడికి ఉండదు. "రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. ఈ ఉత్తర్వులపై న్యాయవాదులు కోర్టుకెళ్లిన వెంటనే ఇవి రద్దవుతాయి" అని సెంటర్ ఫర్ ఎలక్షన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రతినిధి డేవిడ్ బెకర్ విమర్శించారు. డెమోక్రాట్ల పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలను తన ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మెయిల్ ఓటింగ్‌పై అపనమ్మకం

మెయిల్ ద్వారా ఓటు వేసే విధానంలో భారీగా మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. 2025లో బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మెయిల్ ఓటింగ్‌లో మోసాలు కేవలం 0.000043 శాతం మాత్రమేనని తేలింది. అంటే ప్రతి కోటి ఓట్లలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే తప్పుగా పడే అవకాశం ఉందని స్పష్టమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వయంగా ట్రంప్ కూడా గత వారం ఫ్లోరిడా స్థానిక ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేశారు. ప్రయాణాలు లేదా సైనిక విధుల్లో ఉన్నవారు మెయిల్ ఓటు వాడటాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అందరికీ వర్తించే 'యూనివర్సల్ మెయిల్ ఓటింగ్‌'ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది.