Let's talk: editor@tmv.in
అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ

Dantu Vijaya Lakshmi Prasanna
28 నవంబర్, 2025

అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేశారు. . రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. మొదటి దశలో రూ.140 కోట్లు వ్యయంతో వివిధ పనుల్ని చేపట్టనున్నారు. రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చు కానుంది. ఇక రెండోదశ పనులను రూ.120 కోట్లతో చేపట్టనున్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన నేపథ్యంలో ఈ శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులు చేపట్టనున్నారు. 4వ విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలుస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆలయ విస్తరణకు గత ప్రభుత్వంలో గ్రహణం

తిరుమల తరహలో రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నది తీరాన అత్యద్భుతంగా వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి 25.417 ఎకరాలు కేటాయించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గత పాలకులు ఆలయ విస్తీర్ణాన్ని కుదించారు. కేటాయించిన భూమిలోనూ కోత పెట్టడంతో పాటు విస్తరణ పనులు రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి దేవాలయం విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....

ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించాం. దేవతల రాజధాని అమరావతి... మన రాజధాని అమరావతి. అమరావతి పేరు పెట్టడానికి కూడా దేవుడు నాకు అవకాశాన్ని కల్పించారు. మన రాష్ట్రంలో కలియుగ దైవం అవతరించారు. 2019లో ఆలయాన్ని నిర్మిచేందుకు సంకల్పించాం. ఈ ప్రాంత రైతులను ఈ దేవుడి సన్నిధి నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. పవిత్రమైన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి... ఇక్కడి రైతులు సహకరించి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారు. 25 ఎకరాల్లో పవిత్రమైన ప్రదేశం, కృష్ణానది ఒడ్డున వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం. ఈ అమరావతి విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. దేవతల రాజధానిగా అమరావతి ఏవిధంగా ఉంటుందో...ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నానన్నారు.

ఎన్టీఆర్ అన్నదానం 1983లో ప్రారంభించారు... నేను 2003లో ప్రాణదాణం తిరుపతిలో ప్రారంభించాను. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తే ఆ వెంకటేశ్వరుడు నాకు ప్రాణభిక్ష పెట్టారు. నేను, మా కుటుంబం ఇంటి దైవంగా వెంకటేశ్వరస్వామికి కొలుస్తాం. మా ఇంటి నుంచి చూస్తే స్వామి కొలువున్న శేషాచలం పర్వతం కనబడతుంది.. ఆయన్ను చూస్తూ బతికి, స్వామి పాదపద్మాల చెంత తరించామన్నారు.

వేంకటేశ్వరస్వామికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను

ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు పవిత్ర, పరిశుభద్రత, స్వచ్ఛమైన ఆలోచన ఉండాలి... అప్పుడే నిజమైన భక్తితో పని చేసినట్లు అవుతుంది అని చంద్రబాబు అన్నారు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్లినా క్యూలైన్లోనే భక్తితో వెళ్తాను. దేవుడి దగ్గరకు పెత్తందారుగా వెళ్లకూడదు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే స్వామి శిక్షిస్తారు. ఆయన పవిత్రను ఆయనే కాపాడుకుంటున్నారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన సందర్భాలు లేవు. మంచి సంకల్పంతో రైతులు భూములు ఇస్తే నరకాన్ని చూపించారు. మీరు వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసి రాజధానిని కాపాడుకోవడానికి పాటుపడ్డారు. ఈ పవిత్రమైన దేవాలయాలయాన్ని రూ.260 కోట్లతో పూర్తి చేస్తాం. అమరావతినే కాకుండా, ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ దేవాలయానికి ఉంది. రెండున్నరేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని టీటీడీని కోరుతున్నానన్నారు. ఆలయాల నిర్మాణాలకు భక్తులు ముందుకు రావాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను అన్నారు.

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ - Tholi Paluku