Let's talk: editor@tmv.in
అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్‌: సీఎం విష్ణు దేవ్ సాయ్

అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్‌: సీఎం విష్ణు దేవ్ సాయ్

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

రాష్ట్రాన్ని ‘నక్సలిజం రహితం’గా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు నూతన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. భద్రతా చర్యల నుంచి గ్రామీణాభివృద్ధి, మావోయిస్టుల పునరావాసం వంటి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలిజం సమస్యను నిర్మూలించడంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్దేశించిన లక్ష్యాలతో భద్రతా బలగాలు సమర్థంగా పని చేశాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కారమవుతుందా అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ నక్సలిజం నుంచి బయటపడింది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశను ప్రారంభిస్తుందని సాయ్ చెప్పారు.

బస్తర్‌ ప్రాంతానికి ‘బస్తర్ 2.0’ ప్రణాళిక

ఒకప్పుడు నక్సలిజానికి కేంద్రంగా గుర్తింపు పొందిన బస్తర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఖనిజ సంపదతో పాటు ప్రకృతి సౌందర్యం ఉన్న ఈ ప్రాంతాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘బస్తర్ 2.0’ పేరిట రూపొందించిన ప్రణాళికలో పర్యాటకం, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు.

గ్రామీణాభివృద్ధికి ‘నియాద్ నెల్లనార్’ కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ‘నియాద్ నెల్లనార్’ (మన మంచి గ్రామం) కార్యక్రమం ద్వారా ముందుగా చేరుకోలేని 500కుపైగా గ్రామాలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ టవర్లు ఏర్పాటు, రహదారుల నిర్మాణం, ప్రతి కుటుంబానికి విద్యుత్‌, తాగునీరు అందించడంపై చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం ఇంద్రావతి నదిపై దేవ్‌గావ్‌, మాథ్నా సాగునీటి ప్రాజెక్టులకు రూ.2,000 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం

సుమారు 3,000 మంది లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసం ప్రభుత్వ ప్రణాళికలో కీలక భాగంగా ఉందని సాయ్ పేర్కొన్నారు. వారు తిరిగి హింసాత్మక మార్గంలోకి వెళ్లకుండా ఆర్థిక సహాయం, భూమి కేటాయింపు, నైపుణ్య శిక్షణ అందించనున్నారు.

లొంగిపోయిన ప్రతి వ్యక్తికి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.10,000 చొప్పున భృతి ఇవ్వడంతో పాటు ఒకేసారి రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తారు. గ్రామాలకు తిరిగి వెళ్లే వారికి ఒక హెక్టారు వ్యవసాయ భూమి, పట్టణాల్లో స్థిరపడదలచిన వారికి నివాస స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు.

పెట్టుబడులకు ప్రోత్సాహం

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించే లేదా రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. నక్సలిజం ప్రభావం తగ్గడంతో ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని సీఎం విష్ణు దేవ్ సాయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్‌: సీఎం విష్ణు దేవ్ సాయ్ - Tholi Paluku