
అదృశ్యమవుతున్న భారతీయ స్థానిక భాషలు: ఒక సాంస్కృతిక అత్యవసర పరిస్థితి
ఎన్నో ఏళ్ల తర్వాత ఎవరో మన మాతృభాషలో పలకరిస్తే గుండె ఒక్కసారిగా ఉవ్వెత్తున స్పందిస్తుంది. ఇంటి వాసన, నేల మట్టి, చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా మన చుట్టూ చేరిపోతాయి. భారతదేశం అటువంటి అనుభూతుల, అటువంటి భాషా వైవిధ్యాల దేశం. ఒకటి రెండు కాదు, వందలు… వేల సంవత్సరాలుగా జీవించిన రాగాలూ, ఉచ్చారణలూ, పదాలూ, పాటలూ. ఒకప్పుడు భారతదేశంలో 1600కి పైగా భాషలు మాట్లాడేవారు. కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. నేడు సజీవంగా ఉన్న భాషలు 450కి కూడా తగ్గిపోయాయి. మిగతావి కేవలం పురాతన దస్తావేజుల్లో, పాత గ్రామాల కథల్లో, లేదా అకాడెమిక్ ఫైళ్లలో మాత్రమే మిగిలాయి. పది పన్నెండు సంవత్సరాలకు ఒకటి రెండు భాషలు మౌనంగా మన నుండి జారి పోతున్నాయి. ఎక్కడా ఆ వార్తా లేదు. ఎవరూ దుఃఖించరు. గ్రామ పెద్దల చివరి మాటలతో ఒక భాషకు శవయాత్ర జరుగుతుంది. ఇది కేవలం భాషా సమస్య కాదు. ఇది నిజమైన సాంస్కృతిక అత్యవసర పరిస్థితి, కానీ మనం గుర్తించకుండా ముందుకు కదులుతున్నాం.
నిశ్శబ్దంగా కనుమరుగవుతున్న భాషలు
భాష ఒక్కసారిగా చచ్చిపోదు. అది నెమ్మదిగా వెలుతురు తగ్గుతున్న కొవ్వొత్తిలా మసకబడుతూ పోతుంది. ఒక తరం పట్టణాలకు వెళ్తుంది, ఇంట్లో మాటలు మారిపోతాయి, స్కూళ్లలో ఇంగ్లీష్ హిందీ ప్రాంతీయ ప్రధాన భాషల ఒత్తిడి పెరుగుతుంది. పాతవాళ్లు మరణిస్తారు; వాళ్లతో పాటే పదాల పుట్టుక కథలు, పాటలు, సామెతలు, గొప్ప జ్ఞానం కూడా అంతరించిపోతాయి. ఒక భాష మరణం అంటే ఏమిటంటే చివరి బిడ్డ ఆ భాషలో ఆడుకోవడం ఆపిన రోజు అది చనిపోయినట్టే. భారతదేశంలో ఇది భయంకర వేగంతో జరుగుతోంది. 1961 జనగణనలో 10,000 మందికి పైగా మాట్లాడే 300కి పైగా భాషలు ఉండగా, 2011కి ఆ సంఖ్య 121కి తగ్గిపోయింది. దాదాపు 250 భాషలు సగం శతాబ్దిలోనే అదృశ్యమయ్యాయి.సురా, మ్రా, మజ్హి, మావో, టోక్రీ కోళి వంటి భాషలు ఎవరికి తెలియకుండానే చరిత్రలో కలిసిపోయాయి.
భారత భాషా వైవిధ్యానికి ఉన్న అపూర్వ కారణాలు
భారతదేశంలో భాషలు ఇంత విస్తారంగా ఉండటం యాదృచ్ఛికం కాదు. వేల ఏళ్లుగా వలసలు, యుద్ధాలు, రాజ్యాలు, అడవి జీవనశైళ్లు, పర్వత ప్రాంతాలు, వాణిజ్య మార్గాలు, నదీ తీరాలు… ఇవన్నీ పదాలను తమతమ రీతిలో మలిచాయి. ఈ కారణంగా ప్రతి జిల్లాకీ స్వరాలు, పదాల బరువు, వ్యాకరణం, పాటల శైలి వేరుగా ఉంటుంది. హిందీ అన్నదానికి దాదాపు డజన్ల కొద్దీ రూపాలు ఉన్నాయి అవధీ, బ్రజ్, హర్యాణవి, బోజ్పురి… ఇవన్నీ తమతమ ప్రపంచాల్లా ఉంటాయి. తిరుపతిలో మాట్లాడే తెలుగు ఒక రకం , హైదరాబాద్ తెలుగు ఒక రకం. ఈశాన్య భారతదేశం అయితే భాషా దేవాలయమే; సైనో-టిబేటన్, ఆస్ట్రోఆసియాటిక్, తై భాషా కుటుంబాలు అక్కడే వేర్లూనుకున్నాయి. కానీ ఈ అందమైన రంగుల పూల తోట నెమ్మదిగా ఎండిపోతున్నది
ఆధునిక జీవితపు ఒత్తిడి
భారత భాషలు కనుమరుగవడానికి ప్రధాన కారణం “ఆసక్తి కోల్పోవడం” కాదు ఇంగ్లీష్, హిందీ లేదా పెద్ద రాష్ట్ర భాషలు మాట్లాడితేనే అవకాశాలు దక్కుతాయని ప్రజలు నమ్ముతున్నారు.పల్లె భాషల్లో మాట్లాడితే పిల్లలు వెనకపడతారనే భయం. స్కూళ్లలో చిన్నపిల్లలను తమ మాతృభాష మాట్లాడినందుకు శాసించే కథలు అనేకం ఉన్నాయి.పట్టణ వలసలు మరో సమస్య. ఒక చిన్న గిరిజన భాష మాట్లాడే యువకుడు బెంగళూరు లేదా దిల్లీ వెళ్లి సంవత్సరాలపాటు అనుకోని భాషల్లో బతుకుతాడు. తిరిగి ఊరికి వస్తే స్వభాష మాట్లాడడంపై సిగ్గు పడుతాడు. ఈ చక్రం ఒక్కొక్క సమాజంలో ఒకే తరంలో పాతుకుపోతుంది.
అంతరించిపోతోన్న అరుదైన భారత భాషలు
ప్రస్తుతం భారత్లో కొన్ని భాషలకు 100 మందికంటే తక్కువ మంది మాట్లాడేవారు మాత్రమే మిగిలారు. చాలా మందికి తెలియని పేర్లు చైమాల్ (త్రిపుర), సైమార్ (మేఘాలయ), టోటో (పశ్చిమ బెంగాల్), నిహాలి (మహారాష్ట్ర–ఎంపీ), గ్రేట్ ఆండమానీస్ యొక్క భాషలు. గ్రేట్ ఆండమానీస్ గురించి చెప్పాలంటే పది వేర్వేరు భాషలు ఉండేవి. నేడు వాటి అవశేషం మాత్రమే బతికుంది, మాట్లాడేవారు కూడా పది మందికంటే తక్కువ.అరుణాచల్ ప్రదేశ్లో డజన్ల కొద్దీ భాషలు మరణ అంచున ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఒకే ఒక్క వృద్ధుడు మాత్రమే మాట్లాడగలడు. డాక్యుమెంటేషన్ మాత్రమే ఉంటే భాష నిలబడదు. భాషను పిల్లలు మాట్లాడాలి.
ఒక భాష చనిపోతే కోల్పోయేది ఏమిటి?
భాష అంటే కేవలం పదాలు కాదు.
ప్రపంచదర్శనం:
ప్రకృతి, పంటలు, ఋతువులు, నదులు, గాలులు… వీటిని విశదీకరించే పదాలు భాష చనిపోయిన వెంటనే మాయమవుతాయి.
జ్ఞానం:
ఔషధ మొక్కలు, చికిత్సా పద్ధతులు, అడవి జీవన రహస్యాలు తరతరాలుగా ప్రవహిస్తున్న జ్ఞానం ఎండిపోతుంది
సాంస్కృతిక స్మృతులు:
పాటలు, జానపద కథలు, సామెతలు, శుభాశీస్సులు, వేదనలు ఇవి అన్నీ కనిపించకుండా పోతాయి.
అస్తిత్వం:
మాతృభాష కోల్పోవడం అంటే గుర్తింపులో పెద్ద శూన్యం పడ్డట్టే. ఒక భాష అంతరించిపోతే, దాని వెంట సంపూర్ణ ప్రపంచం అంతరించిపోతుంది.
డిజిటల్ యుగం: మిత్రమా? శత్రువా?
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెట్ అన్నీ ఇంగ్లీష్ ఆధిపత్యంలో తిరుగుతున్నాయి. చిన్నపిల్లలకు ఇంగ్లీష్ నేర్పించటం మర్యాదగా, గర్వంగా మారింది.అదే సమయంలో మొబైళ్లే ఇప్పుడు భాష రక్షకులుగా మారుతున్నాయి. వృద్ధుల మాటలు రికార్డు చేస్తున్నారు. పలుకుబడులు ఆర్కైవ్ చేస్తున్నారు. కొన్ని భాషలకు కీబోర్డులు, యాప్స్ తయారవుతున్నాయి.కానీ కేవలం రికార్డు పరచడం కాదు పునరుజ్జీవనం అవసరం.
ప్రత్యేక ప్రయత్నాలు: చిన్న చిరు దీపాలు
భాషలను కాపాడేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒడిశాలో గిరిజన పిల్లల కోసం మాతృభాష బోధన. నాగాలాండ్లో యువత భాషా క్లబ్బులు. సిక్కింలో షెర్పా, తమాంగ్, లింబు వంటి ప్రమాదంలో ఉన్న భాషలకు గుర్తింపు. పశ్చిమ బెంగాల్లోని టోటో తెగ తమ భాష పెంపొందించే పాఠశాలలు ప్రారంభిస్తోంది. ఈ ప్రయత్నాలు అవసరమైనా, ఒక దేశాన్ని కాపాడేంత పెద్దవి కావు.
ప్రభుత్వం పాత్ర అత్యంత కీలకం
భారత రాజ్యాంగం బహుభాషా విధానాన్ని గుర్తించింది. కానీ అమలు నెమ్మదిగా సాగుతున్నది. 10,000 మందికి తక్కువ మాట్లాడే భాషలను పాఠ్యాంశాల్లో చేర్చరు. టీచర్లకు ట్రైనింగ్ లేదు. భాషకు స్కూలులో స్థలం లేకపోతే అది ఎలా బతుకుతుంది? మాతృభాషలో ప్రారంభ విద్య పిల్లల నైపుణ్యాలను గణనీయంగా పెంచుతుందని యునెస్కో చేసిన పరిశోధనలు చూపుతున్నాయి. కానీ మాటలకే పరిమితమైపోకుండా ప్రభుత్వ మద్దతు పెరగాలి.
పట్టణ భారతం - నిశ్శబ్దంగా బాధ్యత వహించాల్సిన వర్గం
పట్టణాల్లో ఉన్న వారికి ఈ సమస్య కనిపించదు. ఉద్యోగాలు, స్కూలులు, సొసైటీ అన్నీ ఇంగ్లీష్ హిందీ ఆధారితం. చాలా మంది ఇంట్లో తమ భాష మాట్లాడటాన్ని తగ్గిస్తున్నారు. ఇది కేవలం గిరిజన భాషల సమస్య కాదు. మన నగరాలూ కూడా భాషా మరణానికి కారణం అవుతున్నాయి.
భారతదేశం మళ్లీ వినటం నేర్చుకోవాలి
భారతదేశ బలం ఏకరూపతలో కాదు. వైవిధ్యంలో ఉంది. వేలాది స్వరాలు, పదాలు, కథలు, భావాలు ఇవి మన నాగరికత శ్వాసలు.భాషలను కాపాడటం అంటే గతాన్ని కాపాడటం మాత్రమే కాదు; భవిష్యత్తును కూడా రక్షించడం. మనమందరం మళ్లీ వినాలి, అమ్మమ్మలు పాడిన లాలిపాటలు, తాతయ్యలు చెప్పిన జానపద కథలు, మన వూరిలో కోకిల పా డే పాటలు ,చిలుకలు పలుకులు… భాష చనిపోతే అది తిరిగి పునర్జన్మ పొందదు. దాని స్థానంలో దస్తావేజులు, రికార్డింగులు మాత్రమే మిగుల్తాయి.
భారత భాషలను నిలబెట్టే పోరాటం
భారతంలో భాషలు అదృశ్యం కావడం మనం దృష్టి పెట్టని అత్యంత పెద్ద సంక్షోభాల్లో ఒకటి. రాజకీయాలు, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ మూగ అత్యవసర పరిస్థితి మన సాంస్కృతిక భవనానికి పునాదులను బీటలు వేస్తోంది. ఇంకా సమయం ఉంది. కానీ ఎక్కువ లేదు.భారతదేశం భాషలను కాపాడాలని నిశ్చయించుకుంటే, మన దేశం రేపటిలోనూ అనేక స్వరాల భూమిగానే నిలుస్తుంది. లేకపోతే ఒకరోజు ఈ నిశ్శబ్దం మనల్ని భయపెడుతుంది. భాషలు జీవించేది పుస్తకాలలో కాదు, స్కూల్ రికార్డుల్లో కాదు, మన నాలుకలపై, మన పిల్లల మాటలలో.భారతం తన స్వరాలను ఇప్పుడే నిలబెట్టుకోవాలి.
