
అణగారిన వర్గాల నేత కాన్షీరాం: బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన చేసిన కృషి పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల నివాళులు
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఎక్స్లో పోస్టు చేస్తూ కాన్షీరాం పేదలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని అన్నారు. ఆయన అంకితభావం, కృషి అందరికీ ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగమే నిజమైన బలం అని కాన్షీరాం నమ్మేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారే దాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారంలో భాగస్వామ్యం లేకుండా న్యాయం సాధ్యం కాదనే కాన్షీరాం సందేశం ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కాన్షీరాం దళితులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతులను సమీకరించి భారత రాజకీయ ప్రధాన ప్రవాహంలో వారికి గౌరవప్రద స్థానం కల్పించిన మహోన్నత సామాజిక సంస్కర్త అని అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా కూడా కాన్షీరాం జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయ సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచిన ఆయన దళితులు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని ఆమె అన్నారు. సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ విలువలను ఆయన ఉద్యమాల ద్వారా మరింత బలపరిచారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో నేతల నివాళులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్షీరాం దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు.
బీఎస్పీ అధినేత మాయావతి కూడా కాన్షీరాం జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులతో కలిసి తన నాయకత్వంలో ఘనంగా జయంతి జరుపుకుంటున్నట్లు తెలిపారు. డా. బీఆర్. అంబేద్కర్ ఆలోచనలు, ఉద్యమాలను దేశవ్యాప్తంగా విస్తరించి రాజకీయ శక్తిగా మలిచిన నాయకుడు కాన్షీరాం అని ఆమె పేర్కొన్నారు. బహుజన సమాజం రాజకీయ అధికారాన్ని సాధించాలన్న ఆయన లక్ష్యాన్ని నెరవేర్చడానికి బీఎస్పీ ‘సామాజిక మార్పు–ఆర్థిక విముక్తి’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని మాయావతి తెలిపారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ కాన్షీరాం సామాజిక మార్పుకు ప్రతీకగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు.
నాగినా లోక్సభ సభ్యుడు, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా కాన్షీరాం జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. నిద్రలో ఉన్న ఒక పెద్ద సమాజాన్ని మేల్కొల్పిన నాయకుడు కాన్షీరాం అని ఆయన అన్నారు.
కాన్షీరాం జీవితం
కాన్షీరాం 1934 మార్చి 15న పంజాబ్లోని రూప్నగర్లో జన్మించారు. వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. ఆయన 1971లో ఆల్ఇండియా బ్యాక్వర్డ్స్ అండ్ మైనార్టీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బామ్సెఫ్ )ను స్థాపించారు. తరువాత 1981లో దళిత్ శోశిత్ సమాజ్ సంఘర్ష్ సమితిని ఏర్పాటు చేసి, 1984లో బహుజన్ సమాజ్ పార్టీని ప్రారంభించారు. కాన్షీరాం 1991లో ఉత్తరప్రదేశ్లోని ఎటావా నుంచి, 1996లో పంజాబ్లోని హోషియార్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన ఈ మహానేత 2006 అక్టోబర్ 9న ఢిల్లీలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
