
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలి: రోహిత్ పవార్
జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో సీనియర్ మహారాష్ట్ర నేత అజిత్ పవార్ మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్సీపీ–శరద్చంద్ర పవార్ వర్గానికి చెందిన నాయకుడు రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడిన రోహిత్ పవార్, ప్రమాదానికి గురైన వీఎస్ఆర్ సంస్థ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. వీఎస్ఆర్ సరిగా పనిచేయడం లేదని మాకు తెలిసింది. వీఐపీలు ఈ ఎయిర్లైన్లో ప్రయాణిస్తుంటారు. వారి ప్రాణాలకు ముప్పు ఉండొచ్చు. జనవరి 28న జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం. మా నాయకుడు అజిత్ పవార్ను కోల్పోయాం. కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర ప్రజలు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతున్నారు. వీఎస్ఆర్ పాత్రను పూర్తిగా పరిశీలించాలి. అలాగే క్రిమినల్ కోణంలోనూ విచారణ జరగాలి. జనవరి 27న జరిగిన పరిణామాలపై కూడా దర్యాప్తు అవసరమని ఆయన అన్నారు. జనవరి 28 ఉదయం పుణే జిల్లా బరామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు నలుగురు మరణించారు. విమాన ప్రమాదాలపై దర్యాప్తులు అంతర్జాతీయ ఏఏఐబీ ప్రోటోకాళ్లు, ఐసీఏఓ నిబంధనల ప్రకారం కఠినంగా, పారదర్శకంగా, ఆధారాలపై ఆధారపడి నిర్వహిస్తాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం తగదని వారు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, సీనియర్ నేత మరణంపై కుటుంబం దర్యాప్తు కోరితే అందులో ఎలాంటి తప్పూ లేదని నాయకుడు వారిస్ పఠాన్ అన్నారు. అజిత్ పవార్ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు. ఆయన కుటుంబం దర్యాప్తు కోరితే తప్పేమీ లేదు. రోహిత్ పవార్ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆ సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంతకుముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ పవార్, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రమాదం రాజకీయ కుట్రా, వాణిజ్య ప్రయోజనాల కుట్రా అన్నది వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 28లోగా ప్రాథమిక నివేదిక – మురళీధర్ మొహోల్
ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఫిబ్రవరి 28లోగా విడుదల అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, పుణె ఎంపీ మురళీధర్ మొహోల్ తెలిపారు. పుణెలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన మొహోల్ ఘటన జరిగిన తేదీ నుంచి ఒక నెలలోగా, అంటే ఫిబ్రవరి 28లోపు ప్రాథమిక నివేదిక విడుదల అవుతుందని చెప్పారు. అయితే రోహిత్ పవార్ ఆరోపణలపై స్పందించేందుకు మొహోల్ నిరాకరించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసి విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించిందని తెలిపారు. విచారణకు సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉంచుతోంది. నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరి వ్యాఖ్యలపై నేను స్పందించదలచుకోలేదని ఆయన అన్నారు. ఫిబ్రవరి 19న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
