
అగరబత్తీల్లో హానికర రసాయనాలకు నో: కొత్త బీఐఎస్ నిబంధనలు విడుదల
మన ఇళ్లలో, పూజా గదుల్లో నిత్యం వెలిగించే అగరుబత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగరబత్తీల తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు కొత్త నాణ్యత ప్రమాణాలను (బీఐఎస్ స్టాండర్డ్స్) ప్రవేశపెట్టింది. శుక్రవారం జరిగిన 'జాతీయ వినియోగదారుల దినోత్సవం' సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కొత్త నిబంధనలను విడుదల చేశారు.
హానికరమైన రసాయనాలపై నిషేధం
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అగరబత్తీలు సువాసన వెదజల్లడానికి, ఎక్కువ సేపు వెలగడానికి కొన్నిసార్లు ప్రమాదకరమైన రసాయనాలను వాడుతుంటారు. ఇవి గాలిని కలుషితం చేయడమే కాకుండా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. అందుకే ప్రభుత్వం ఐఎస్ 19412:2025 పేరుతో కొత్త రూల్స్ తెచ్చింది. దీని ప్రకారం.. ఆరోగ్యంపై ప్రభావం చూపే అలేత్రిన్, పర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్, ఫిప్రోనిల్ వంటి కీటకనాశకాలు, అలాగే బెంజిల్ సయనైడ్, ఇథైల్ అక్రిలేట్, డైఫెనైల్ అమైన్ వంటి సింథటిక్ సువాసన రసాయనాలను అగరబత్తుల్లో ఉపయోగించరాదు. వీటిలో కొన్ని అంతర్జాతీయంగా ఇప్పటికే నిషేధించారు.
నాణ్యతకు 'బీఐఎస్' మార్క్
ఇకపై అగరబత్తీలను మూడు రకాలుగా వర్గీకరించనున్నారు. మెషీన్లతో తయారు చేసినవి (మెషిన్ మేడ్), చేతితో తయారు చేసినవి (హ్యాండ్ మేడ్), సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే మసాలా మసాలా అగరబత్తీలు. ముడి పదార్థాలు, కాలే విధానం, వాసన నాణ్యత, రసాయన పరిమితులు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి. దీని వల్ల వినియోగదారులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయి.
ఈ కొత్త ప్రమాణాలను పాటించే అగరబత్తీలకు బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా వినియోగదారులు నమ్మకంగా, సరైన ఉత్పత్తిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నైతికమైన తయారీ విధానాలు, పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తి ప్రక్రియలు కూడా ప్రోత్సహించబడతాయి.
మహిళల ఉపాధికి కొండంత అండ
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను ఉత్పత్తి చేసే దేశం. మన దేశంలో ఈ పరిశ్రమ విలువ ఏడాదికి సుమారు రూ.8,000 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలకు మనం అగరబత్తీలను ఎగుమతి చేస్తున్నాం. ఈ రంగం ముఖ్యంగా గ్రామాల్లో ఉండే లక్షలాది మంది మహిళలకు, చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పిస్తోంది. కొత్త నాణ్యత ప్రమాణాల వల్ల భారతీయ అగరబత్తీలకు విదేశాల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
మనం వెలిగించే అగరుబత్తి కేవలం సువాసనను మాత్రమే కాదు, స్వచ్ఛమైన గాలిని కూడా ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నిపుణులు, శాస్త్రవేత్తలు చర్చించి రూపొందించిన ఈ కొత్త నిబంధనలు అగరుబత్తుల తయారీలో మంచి మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
