
అంగన్వాడీ ఆయాగా దళిత మహిళ... సెంటర్కు రాని పిల్లలు
ఒడిశాలోని కేంద్రమంత్రపుర జిల్లా రాజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాలిమాల గ్రామపంచాయతీ నువాగావ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి, గత మూడు నెలలుగా ఒక్క పిల్లవాడు కూడా రావడం లేదు. కారణం ఆ కేంద్రంలో దళిత వర్గానికి చెందిన మహిళను సహాయకురాలి(ఆయా)గా నియమించడమేనని అధికారులు తెలిపారు. ఆ అంగన్వాడీ కేంద్రంలో గతంలో 3 నుంచి 6 ఏళ్ల వయసున్న సుమారు 20 మంది పిల్లలు క్రమం తప్పకుండా హాజరయ్యేవారని, అయితే 2025 నవంబర్లో దళిత మహిళ శర్మిష్ఠ సేథీ సహాయకురాలిగా నియమితులైన తర్వాత, నవంబర్ 21 నుంచి ఒక్క పిల్లవాడు కూడా కేంద్రానికి రాలేదని అధికారులు చెప్పారు. ఆ పిల్లలంతా ఉన్నత కులాలకు చెందిన వారేనని పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన అంగన్వాడీ సహాయకురాలు శర్మిష్ఠ సేథీ ఈ నియామకానికి నేను మాత్రమే దరఖాస్తు చేసుకున్నాను. నన్ను నవంబర్లో నియమించారు. కానీ నా కులాన్ని కారణంగా చూపిస్తూ పిల్లల తల్లిదండ్రులు కేంద్రానికి పిల్లలను పంపడం మానేశారు. కుల వివక్షకు నేను బాధితురాలినయ్యాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థుల నిరసన కారణంగా మూడు నెలలుగా అంగన్వాడీ కేంద్రం మూతపడినట్టే ఉందని ఒక గ్రామస్తుడు తెలిపారు. తాజాగా నియమించిన సహాయకురాలిని గ్రామస్తులు అంగీకరించకపోవడమే దీనికి కారణమని ఆయన అన్నారు. గ్రామంలో సంప్రదాయ కుల ఆచారాలు కొనసాగుతున్నాయని, అందువల్ల తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించేదిలేదని, అక్కడి నుంచి ఆహారం కూడా తీసుకోమని గ్రామస్తులు స్పష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంపై స్పందించిన శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీఓ) దీపాలి మిశ్రా, సమస్యను జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు. గ్రామస్తులకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, వారు తమ నిర్ణయంపై కట్టుబడి ఉన్నారని ఆమె అన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా సామాజిక సంక్షేమాధికారి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని గ్రామానికి పంపినట్లు కేంద్రమంత్రపుర కలెక్టర్ రాఘురామ్ ఆర్. అయ్యర్ తెలిపారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన సహాయకురాలి నియామకానికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన కుల వివక్షతో సంబంధముందో లేదో పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనపై హక్కుల కార్యకర్త బిశ్వప్రియ కనుంగో తీవ్రంగా స్పందించారు. పిల్లల మనసుల్లో కుల విద్వేషాన్ని నాటడం అత్యంత ఆందోళనకరం. ఇలాంటి కుల వివక్ష నేరానికి సమానం. దీనికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
